మేడమ్‌ టుస్సాడ్‌లో వరుణ్‌ ధావన్‌ విగ్రహం

16 Oct, 2017 18:06 IST|Sakshi

సాక్షి, సినిమా : బాలీవుడ్‌లో హైపర్‌ హీరోగా పేరొందిన వరుణ్‌ ధావన్‌కు అరుదైన గౌరవం దక్కింది. మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియంలో ఈ యంగ్‌ హీరో మైనం విగ్రహం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. 

హంకాంగ్‌లో ఉన్న బ్రాంచ్‌లో వరుణ్‌ ప్రతిమను ఏర్పాటు చేసేందుకు మ్యూజియం అధికారులు ముందుకు వచ్చారు. ఈ మేరకు కొత్త చిత్రం షూటింగ్‌లో ఉన్న వరుణ్‌ దగ్గరికే స్వయంగా వెళ్లి మరీ కొలతలు తీసేసుకున్నారు. ఇదే మ్యూజియంలో మహత్మా గాంధీ, నరేంద్ర మోదీ, అమితాబ్‌ బచ్చన్‌ విగ్రహాలు ఉండగా.. వారి సరసన ఇప్పుడు బాలీవుడ్‌ హీరో కూడా చేరిపోతున్నాడన్న మాట.

వరుణ్‌కు నటుడిగా, యూత్‌ ఐకాన్‌గా కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారని.. అందుకే ఆయన విగ్రహ ఏర్పాటు చేయబోతున్నామని మ్యూజియమ్‌ నిర్వాహకులు తెలిపారు. మరోవైపు తన విగ్రహ ఏర్పాటుపై ట్విట్టర్‌ వేదికగా వరుణ్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. బాలీవుడ్‌ తరపున అమితాబ్‌, షారూఖ్‌, అమీర్‌, సల్మాన్‌, ఐష్‌, హృతిక్‌, సౌత్‌లో ప్రభాస్‌ ఇలా పలువురి సినీ సెలబ్రిటీల విగ్రహాలు మేడమ్‌ టుస్సాడ్‌లో ఉన్నాయి. అయితే చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన నటుడిగా వరుణ్‌(30 ఏళ్లు) ఇప్పుడు రికార్డు క్రియేట్‌ చేశాడు. వచ్చే ఏడాది ఈ విగ్రహం సందర్శకుల కోసం అందుబాటులోకి రానుంది.

మరిన్ని వార్తలు