క్రేజీ కాంబినేషన్‌ ఉన్నా కథే ముఖ్యం

14 Feb, 2018 01:26 IST|Sakshi
బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌

‘‘తొలిప్రేమ’ కథ సెకండాఫ్‌ సరిగ్గా కుదరలేదని ‘దిల్‌’ రాజు తప్పుకున్నారు. ఆ కథ నాకన్నా ముందు మా అబ్బాయి బాపినీడు విన్నాడు. తర్వాత వరుణ్‌ తేజ్‌కి వినిపించారు. కథను, డైరెక్టర్‌ని వరుణ్‌ నమ్మారు. ‘ఫిదా’ వంటి లవ్‌ ఎంటర్‌టైనర్‌ తర్వాత మళ్లీ లవ్‌స్టోరీ ఒప్పుకోవడం సాహసమే. అందుకే.. ఈ సక్సెస్‌ క్రెడిట్‌ వరుణ్‌కే దక్కుతుంది’’ అని నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ అన్నారు. వరుణ్‌ తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘తొలిప్రేమ’ ఇటీవల విడుదలైంది. 

ఈ సందర్భంగా బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘నా తొలిప్రేమ నా వైఫే. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘కొత్త డైరెక్టర్‌తో నేను సినిమా చేయను. బాపినీడు వల్లే అది కుదిరింది. మళ్లీ మా బ్యానర్‌లో కొత్త డైరెక్టర్‌ సినిమా అంటే బాపినీడు చూసుకుంటాడు. ‘తొలిప్రేమ’ విషయంలో నేను మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో కూర్చున్నానంతే. మార్పులు చేశాక సెకండాఫ్‌ విని ‘దిల్‌’ రాజు ఇంప్రెస్‌ అయి, డిస్ట్రిబ్యూషన్‌ తీసుకున్నారు.

ఇప్పుడు పెద్ద స్టార్స్‌ అంతా బిజీగానే ఉన్నారు. వారితో సినిమా అంటే టైమ్‌ పడుతుంది.మల్టీస్టారర్‌ సినిమా తీయగలిగే సత్తా డైరెక్టర్‌కి ఉండాలి. రాజమౌళికి ఆ కెపాసిటీ ఉంది. ‘తొలిప్రేమ’తో 24 సినిమాలు పూర్తయ్యాయి. 25వ సినిమా కోసం స్పెషల్‌గా ప్లాన్‌ చేయడంలేదు. ఎంత క్రేజీ కాంబినేషన్‌ ఉన్నా కథ ఉండాల్సిందే. నిర్మాత కూడా కథలో ఇన్వాల్వ్‌ అయినప్పుడే బడ్జెట్‌పై క్లారిటీ ఉంటుంది. ఇండస్ట్రీలో అందరు పెద్ద డైరెక్టర్స్, స్టార్స్‌తో సినిమాలు చేశా. ఒక్క మహేశ్‌బాబుతో తప్ప. ఆయనతో కూడా త్వరలో ప్లాన్‌ చేస్తా’’ అన్నారు.

మరిన్ని వార్తలు