కార్తీ చిత్రానికి ఉప రాష్ట్రపతి ప్రశంసలు

18 Jul, 2018 08:35 IST|Sakshi

తమిళసినిమా: కార్తీ కథానాయకుడిగా సూర్య నిర్మించిన కడైకుట్టి సింగం చిత్రంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. నటుడు సూర్య తన 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై ఆయన సోదరుడు కార్తీ హీరోగా నిర్మించిన చిత్రం కడైకుట్టి సింగం. నటి సాయేషా సైగల్, ప్రియ భవానీ శంకర్‌ హీరోయిన్లుగా నటించారు. నటుడు సత్యరాజ్‌ ప్రధాన పాత్రలను పోషించిన ఈ చిత్రానికి పసంగ పాండిరాజ్‌ దర్శకుడు. గ్రామీణ నేపథ్యంలో రైతు కుటుంబాల ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రం గత శుక్రవారం తెరపైకి వచ్చింది.

ఇదే చిత్రం తెలుగులో చినబాబు పేరుతో అనువాదమై విడుదలైంది. విశేషం ఏమిటంటే తెలుగు వెర్షన్‌ చినబాబు చిత్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిలకించడం. చిత్రం చూసిన ఆయన తన ట్విట్టర్‌లో ప్రశంసించారు. ప్రజలపై, సమాజంపై చాలా ప్రభావాన్ని చూపే మాధ్యమం సినిమా అని నమ్మే ఆయన సమీపకాలంలో చినబాబు (తమిళంలో కడైకుట్టి సింగం) చిత్రం చూశాను. గ్రామీణ నేపథ్యంలో, మన జీవన విధానాన్ని, విస్మరిస్తున్న అంశాలను, సంస్కృతి, సంప్రదాయాలను అసభ్యతకు తావులేకుండా చూపిన మంచి చిత్రం అని పేర్కొన్నారు.వెంకయ్యనాయుడు ప్రశంసలకు చినబాబు (కడైకుట్టి సింగం) చిత్ర నిర్మాత సూర్య ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేసిన శక్తి ఫిలిం ఫ్యాక్టరీ అధినేత శక్తివేల్‌ మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని వార్తలు