‘వాసు’ గుర్తున్నాడా? వచ్చి 18 ఏళ్లైంది!

10 Apr, 2020 14:37 IST|Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: తల్లిదండ్రులు వారి కలలను పిల్లలపై రుద్దకూడదనే సందేశాన్ని తెలుపుతూ పూర్తి వినోదాత్మకంగా, మ్యూజికల్‌గా సాగిన చిత్రం ‘వాసు’ . విక్టరీ వెంకటేష్‌- భూమిక జంటగా నటించిన ఈ చిత్రానికి కరుణాకరన్‌ దర్శకత్వం వహించారు. హారిస్‌ జయరాజ్‌ అందించిన పాటలు సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. యూత్‌, ఫ్యామిలీ, మాస్‌ ఇలా అన్ని రకాల ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం గొప్ప విజయాన్ని అందుకుంది. సీసీ మీడియా ఎంటర్‌టైన్మెంట్‌పై కేఎస్‌ రామారావు నిర్మించిన ఈ చిత్రం విడుదలైన నేటికి 18 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలు మీకోసం..​

‘వాసు’సినిమా పేరు మదిలో మెదలగానే అందరికి గుర్తొచ్చేవి పాటలు. ప్రతీ ఒక్క పాట ఆణిముత్యమే. ముఖ్యంగా ‘పాటకు ప్రాణం పల్లవి అయితే..ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా...’, ’ఓ ప్రేమా.. ఓ ప్రేమా..’ అంటూ సాగే పాటలు సంగీత ప్రియుల్ని ముఖ్యంగా ప్రేమికులను ఎంతగానో అలరించాయి. వెంకటేష్‌ నటన ఈ సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌. సంగీతంపై తన ఇష్టాన్ని తెలుపుతూనే దివ్య(భూమిక)పై ప్రేమ, తండ్రిపై భయం రెండింటిని చాలా చక్కగా బ్యాలెన్స్‌ చేశాడు. అంతేకాకుండా సునీల్‌, అలీ, దర్మవరపు సుబ్రమణ్యంలతో వెంకీ చేసే కామెడీ మామూలుగా ఉండదు.
 
అమ్మ, చెల్లితో వచ్చే సెంటిమెంట్‌ సీన్స్‌, ప్రేమను వ్యక్తపరిచే సమయంలో వచ్చే ట్విస్టులు ప్రతీ ఒక్కరి మనసులను కదిలించేలా ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో హార్ట్‌ టచింగ్‌ డైలాగ్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ రోమాలు నిక్కబొడిచేలా ఉంటాయి. ‘వాసు’ వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ టీవీల్లో ఈ చిత్రం వస్తే ఛానల్‌ మార్చకుండా చూసేవారు అనేకమంది ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. ఎక్కడా బోర్‌ కొట్టకుండా ప్రతీ సీన్‌ను చాల చక్కగా ప్రజెంట్‌ చేశాడు దర్శకుడు కరుణాకరన్‌​. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్నారు కదా.. కుటుంబసమేతంగా మ్యూజికల్‌ హిట్‌ ‘వాసు’ సినిమాను మరో చూసి ఎంజాయ్‌ చేయండి.

చదవండి: 
పోలీసు బిడ్డగా వారికి సెల్యూట్‌ చేస్తున్నా
మరోసారి అక్షయ్‌ భారీ విరాళం

మరిన్ని వార్తలు