మామాఅల్లుళ్ల జోష్‌

21 Dec, 2019 12:04 IST|Sakshi

గుంటూరులో సందడి చేసిన వెంకీమామ యూనిట్‌  

అలరించిన వెంకటేష్, నాగచైతన్య, హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌

అభిమాన తారలను చూసేందుకు తరలివచ్చిన ప్రేక్షకులు

గుంటూరు ఈస్ట్‌:  బ్రాడీపేట ఏఈఎల్‌ఎం పాఠశాల గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన వెంకీ మామ చిత్ర విజయోత్సవ సభకు హాజరైన  చిత్రయూనిట్‌కు  అభిమానులు ఘనస్వాగతం పలికారు.  విశేష సంఖ్యలో తరలి వచ్చిన అభిమానుల కేరింతలు, వెంకీ మామా అంటూ చిత్రంలోని పాటలు పాడుతూ ప్రాంగణం హోరెత్తింది. దర్శకుడు కె.ఎస్‌.రవీంద్ర (బాబి) మాట్లాడుతూ ఆకాశమంత ప్రేక్షకుల ప్రేమ ఈ చిత్రాన్ని ఘన విజయం వైపు నడిపించిందన్నారు. చిత్రంలోని కొన్ని సన్నివేశాలు స్క్రీన్‌పై ప్రదర్శిస్తూ యాంకర్‌ శ్రీముఖి, కథానాయకి పాయల్‌రాజ్‌పుత్‌ చేసిన వ్యాఖ్యానం, పాటలు, నృత్యాలు, శ్రీముఖి యాంకరింగ్‌తో విజయోత్సవ సభ ధూమ్‌ ధామ్‌గా సాగింది.

కథానాయకుడు విక్టరీ వెంకటేష్‌ తనదైన మేనరిజంతో, డైలాగులతో అభిమానులను ఆకట్టుకున్నారు. అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ వేదిక ముందు ఉన్నవారి ఎనర్జీకి తాను వారికి ఫ్యాన్స్‌ అయ్యానంటూ కితాబిచ్చారు. చక్కటి చిత్రాన్ని మేము మీముందుంచాం. అది బ్లాక్‌బస్టర్‌ అవ్వాలంటే  అభిమానుల వల్లే సాధ్యమవుతుందన్నారు.తొలుత అభిమానులు భారీ ర్యాలీతో చిత్ర యూనిట్‌ను ప్రాంగణానికి తీసుకొచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయ కర్త చంద్రగిరి ఏసురత్నం, సురేష్‌ మూవీస్‌ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్‌ గుంటూరు బ్రాంచ్‌ మేనేజర్‌ మాదాల రత్తయ్య చౌదరి, ఈవీవీ యువ కళావాహిని వ్యవస్థాపకులు వెచ్చా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు