వేణుమాధవ్‌కు కన్నీటి వీడ్కోలు

27 Sep, 2019 02:47 IST|Sakshi

లక్ష్మీనగర్‌ శ్మశానవాటికలో ముగిసిన అంత్యక్రియలు.. 

కుషాయిగూడ : అనారోగ్యంతో బుధవారం కన్నుమూసిన ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌కు అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. గురువారం ఆయన అంత్యక్రియలను హెచ్‌బీకాలనీ లక్ష్మీనగర్‌ శ్మశానవాటికలో నిర్వహించారు. ఉదయం 11 గంటల సమయంలో వేణుమాధవ్‌ పార్థివ దేహాన్ని హెచ్‌బీకాలనీ నుంచి ఫిలింనగర్‌కు తరలించారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి హెచ్‌బీకాలనీకి తీసుకువచ్చి నేరుగా రాజీవ్‌నగర్‌ చౌరస్తా నుంచి అంతిమయాత్ర జరిపారు. అక్కడి నుంచి ఇందిరానగర్‌ చౌరస్తా, వార్డు కార్యాలయం మీదుగా లక్ష్మీనగర్‌ శ్మశానవాటికకు తీసుకెళ్లారు. వేణుమాధవ్‌ చిన్న కొడుకు మాధవ్‌ ప్రభాకరణ్‌ తన తండ్రికి అంతిమ సంస్కారాలను నిర్వహించాడు. ఈ అంతిమయాత్రలో గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మార్పీయస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ, మన ఇంటి పార్టీ అధినేత చెరుకు సుధాకర్, కార్పొరేటర్లు గొల్లూరి అంజయ్య. పన్నాల దేవేందర్‌రెడ్డి పాల్గొ న్నారు. వ్యాపారవేత్త దేవరకొండ శ్రీనివాసరావు, నటుడు ఫిష్‌ వెంకట్, మాజీ కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు. 

వేణుమాధవ్‌ కుటుంబాన్ని ఆదుకుంటాం  
హాస్యనటుడు వేణుమాధవ్‌ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర మంత్రులు ఈటల, ఎర్రబెల్లి తెలిపారు. తెలంగాణ ఓ గొప్ప కళాకారుడిని కోల్పోయిందని, ఇది తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని వారన్నారు. ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, వీరేందర్‌గౌడ్, నివాళులు అర్పించారు.   ఫిలింనగర్‌ వద్ద అగ్ర నటుడు చిరంజీవి, హీరో రాజశేఖర్, నటి జీవిత, మురళీమోహన్, ఉత్తేజ్‌ తదితరులు వేణుమాధవ్‌కు నివాళులర్పించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు