ప్రముఖ బాలీవుడ్‌ నటి గుండెపోటుతో మృతి

18 May, 2017 08:46 IST|Sakshi
బాలీవుడ్‌ నటి రీమా లాగూ గుండెపోటుతో మృతి

ముంబాయి: ప్రముఖ బాలీవుడ్‌ నటి రీమా లాగూ (59) గుండెపోటుతో మృతి చెందారు. గత రాత్రి ఆమెకు ఛాతీలో నొప్పి రావడంతో ​కుటుంబసభ్యులు హుటాహుటీన అంథేరీలోని కోకిలాబెన్‌ ధీరూబాయ్‌ అంబానీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రీమా మరణించారు.  మరాఠీ రంగ స్థలం నుంచి బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన రీమా లాగూ తల్లి పాత్రకు పెట్టింది పేరు.  దూరదర్శన్ ధారావాహికలతో కెరీయర్‌ ప్రారంభించిన ఆమె కయామత్ సే కయామత్ తక్ (1988) చిత్రంతో వెలుగులోకి వచ్చారు. ఈ చిత్రంలో ఆమె జూహీచావ్లా తల్లి పాత్ర పోషించారు. మరాఠీతో పాటు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన రీమా...తనదైన నటనతో ప్రేక్షకుల మెప్పు పొందారు.

అలాగే బాక్స్‌ ఆఫీస్‌ వద్ద కలెక్షన్ల మోత మోగించిన మైనే ప్యార్‌ కియా చిత్రంలో సల్మాన్ ఖాన్ తల్లిగా నటించింది. అలాగే  హమ్‌ ఆప్కే హై కౌన్‌, కుచ్‌ కుచ్‌ హోతా హై, హమ్‌ సాత్‌ సాత్‌ హై, కల్ హో నా హో తదితర చిత్రాల్లో తల్లి పాత్రలు పోషించారు. అలాగే పాపులర్‌ టీవీ షో ‘తూ తూ మే మే’, శ్రీమన్‌ శ్రీమతిలోనూ నటించారు. ప్రస్తుతం రీమా నామకరణ్‌ అనే సీరియల్‌లో విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. మరాఠీ నటుడు వివేక్ లాగూను వివాహం చేసుకున్న రీమా లాగూకు కుమార్తె మృన్మయీ లాగూ ఉన్నారు.  కాగా రీమా మృతితో బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆమె మృతిపట్ల బాలీవుడ్‌ నటీనటులు సంతాపం తెలిపారు.