మిస్‌ బాంబే ఇకలేరు

16 Aug, 2019 00:09 IST|Sakshi
విద్యా సిన్హా

మిస్‌ బాంబే, ‘పక్కింటి అమ్మాయి’ అనిపించుకున్న బాలీవుడ్‌ నటి విద్యా సిన్హా (71) ఇకలేరు. గురువారం ముంబైలో ఆమె తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా ఊపిరి తిత్తుల సమస్యతో బాధపడుతున్నారు విద్యా. మోడలింగ్‌ నుంచి నటిగా మారి బసు చటర్జీ తీసిన ‘రజనీగంధ’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు విద్యా. ప్రముఖ నిర్మాత రానా ప్రతాప్‌ సింగ్‌కు 1947 నవంబర్‌లో జన్మించారు విద్యా. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి, ‘మిస్‌ బాంబే’ కాంటెస్ట్‌లో పాల్గొని, ఆ టైటిల్‌ను సొంతం చేసుకున్నారామె.

బాలీవుడ్‌లో కొత్తతరం హీరోయిన్‌ అనిపించుకుని, పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ తెచ్చుకున్నారు. 1968లో వెంకటేశ్వరన్‌ అయ్యర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె (జాన్వీ) ఉంది. వెంకటేశ్వరన్‌ మరణించిన తర్వాత యాక్టింగ్‌కు దూరం అయ్యారు. ఆ తర్వాత కొంత కాలానికి నేతాజీ అనే డాక్టర్‌ను వివాహం చేసుకున్నారు. ‘పతీ, పత్నీ అవుర్‌ ఓ, చోటీ సే బాత్‌’ వంటి సినిమాలతో పాటు ‘కావ్యాంజలి, బాహు రాణి, జారా’ వంటి టీవీ సీరియల్స్‌లోనూ నటించారు విద్యా సిన్హా.  2011లోవచ్చిన సల్మాన్‌ ఖాన్‌ ‘బాడీగార్డ్‌’ సినిమాలోనూ నటించారామె. విద్యా సిన్హా మృతికి పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలిపారు.

మరిన్ని వార్తలు