మూడు కోణాలు

21 Jan, 2020 00:42 IST|Sakshi
అరుణ్‌ ఆదిత్, శివాత్మిక రాజశేఖర్‌

అరుణ్‌ ఆదిత్, శివాత్మిక రాజశేఖర్‌ జంటగా దుర్గా నరేష్‌ గుత్తా దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘విధి విలాసం’. ఎస్‌.కె.ఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై శివ దినేష్‌ రాహుల్‌ అయ్యర్‌ నకరకంటి నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ప్రారంభం అయింది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు క్లాప్‌ ఇచ్చారు. డైరెక్టర్‌ దశరథ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్‌ చిత్రబృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు.

దుర్గా నరేష్‌ గుత్తా మాట్లాడుతూ– ‘‘ఆదిత్‌ నాకు మంచి సన్నిహితుడు. తనతో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. నటనకి ఆస్కారం ఉన్న పాత్రలో శివాత్మిక నటిస్తున్నారు. రామాయణం ఎలాగైతే మూడు కోణాల్లో ఉంటుందో మా సినిమా కథ కూడా అలాగే ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ కథ విన్నప్పుడే ఆసక్తిగా అనిపించింది. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు శివాత్మిక రాజశేఖర్‌.

‘‘ఫిబ్రవరి మొదటి వారంలో రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభిస్తాం. వేసవిలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు శివ దినేష్‌ రాహుల్‌ అయ్యర్‌ నకరకంటి. ‘‘దశరథ్‌ గారి దగ్గర దుర్గ నరేష్‌ దర్శకత్వ శాఖలో పనిచేశారు.. మంచి ప్రతిభావంతుడు’’ అన్నారు అరుణ్‌ ఆదిత్‌. కోట శ్రీనివాసరావు, ఇంద్రజ, జయప్రకాశ్, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, తాగుబోతు రమేష్, అజయ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌.వి. విశ్వేశ్వర్, సంగీతం: శేఖర్‌ చంద్ర, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శివ మాచర్ల.

మరిన్ని వార్తలు