ఈసారి కామెడీ జాకీ

19 Jan, 2017 00:07 IST|Sakshi
ఈసారి కామెడీ జాకీ

‘‘చూపిస్తా... నేనెంత అల్లరి పిల్లనో త్వరలోనే మీకు చూపిస్తా. ఐయామ్‌ సో నాటీ’’ అంటున్నారు విద్యా బాలన్‌. ‘డర్టీ పిక్చర్‌’లో అందాలను ఆరబోసిన ఈ మలయాళ కుట్టి, ‘కహానీ’లో క్యారెక్టర్‌కి తగ్గట్టు నటిగా విశ్వరూపం చూపించారు. ఇప్పటివరకూ విద్యా బాలన్‌ చేసిన పాత్రలన్నీ అయితే హాటు.. లేదంటే నీటు! అసలు కామెడీ క్యారెక్టర్స్‌ చేయనే లేదు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ‘తుమ్హారీ సులూ’ ఆ లోటు భర్తీ చేస్తుందంటున్నారీ బ్యూటీ. ఇందులో లేట్‌ నైట్‌ ఆర్‌.జె. (రేడియో జాకీ) సులోచన పాత్రలో విద్యాబాలన్‌ నటిస్తున్నారు. సులోచనని ముద్దుగా ‘సులూ’ అని పిలుస్తారన్న మాట. ఆల్రెడీ ‘లగే రహో మున్నాభాయ్‌’లో ఆర్‌.జె.గా నటించిన అనుభవం ఆమెకి ఉంది. అయితే... రెండూ విభిన్నమైన పాత్రలట. ‘‘ప్రస్తుతం నేను ‘బేగమ్‌ జాన్‌’, ‘తుమ్హారీ సులూ’ చిత్రాల్లో నటిస్తున్నా. రెండూ విభిన్నమైన సినిమాలు. ‘తుమ్హారీ...’లో నా క్యారెక్టర్‌ నాలోని నాటీ యాంగిల్‌ ప్రేక్షకులకు చూపిస్తుంది. అనుకోకుండా ఆర్‌.జె. అయిన సులోచనలో కోపం, బాధ, ప్రేమ.. అన్నీ ఉంటాయి. కానీ, కామెడీ హైలైట్‌ అవుతుంది’’ అన్నారామె.