ధన్యవాదాలు బంగారం!

23 Oct, 2019 01:35 IST|Sakshi

‘‘నీ పరిచయం తర్వాత నా జీవితంలో అన్నీ మధుర క్షణాలే. ఈ ఆనందానికి కారణమైనందుకు ధన్యవాదాలు’’ అంటూ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ సోషల్‌ మీడియాలో నయనతారను ఉద్దేశించి ఓ పోస్ట్‌ పెట్టారు. విఘ్నేష్‌ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి, నయనతార జంటగా నటించిన ‘నానుమ్‌ రౌడీదాన్‌’ విడుదలై సోమవారంతో నాలుగేళ్లయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘‘ధన్యవాదాలు బంగారం. ఈ సినిమా ఒప్పుకున్నందుకు థ్యాంక్స్‌. అలాగే నా జీవితం బాగుండే అవకాశం ఇచ్చావు.

ఆ దేవుడి ఆశీర్వాదాలు నీకెప్పుడూ ఉండాలి. నువ్వు బయట, లోపల ఎప్పుడూ ఇంతే అందంగా ఉండాలి. బోలెడంత ప్రేమతో’’ అంటూ నయన పట్ల తనకున్న ఫీలింగ్‌ని షేర్‌ చేశారు విఘ్నేష్‌ శివన్‌. ‘నానుమ్‌ రౌడీదాన్‌’ సినిమా అప్పుడే విఘ్నేష్, నయన ప్రేమలో పడ్డారనే వార్తలు మొదలయ్యాయి. అప్పటినుంచి ఇప్పటివరకూ కలిసి విహార యాత్రలకు వెళ్లడం, ఒకరి పుట్టినరోజుని మరొకరు ఘనంగా జరపడం, పండగలను కూడా కలిసి జరుపుకోవడం.. ఇలాంటివన్నీ ఇద్దరి మధ్య అనుబంధం బలపడిందని చెప్పడానికి ఉదాహరణలు. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని సమాచారం.

>
మరిన్ని వార్తలు