పారితోషికంలో పాతిక కట్‌

6 May, 2020 02:42 IST|Sakshi
విజయ్‌ ఆంటోనీ

కరోనా మహమ్మారి ప్రభావంతో సినిమాల షూటింగ్స్‌ నిలిచిపోయాయి, రిలీజులు ఆగాయి. ఇప్పటికే సినిమాలు ఆరంభించిన, తమ చిత్రాలను విడుదలకు సిద్ధం చేసిన నిర్మాతలు ఇరకాటంలో పడ్డారు. అందుకే సంగీత దర్శకుడు, హీరో విజయ్‌ ఆంటోనీ తన పారితోషికంలో పాతిక శాతాన్ని తగ్గించుకుంటున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఆయన ‘తమిళరసన్‌’, ‘అగ్ని సిరగుగళ్‌’, ‘ఖాకీ’ చిత్రాల్లో నటిస్తున్నారు.

ఈ మూడు సినిమాలకు సంబంధించి నిర్మాతలకు అండగా ఉండేందుకు తన పారితోషికంలో 25 శాతాన్ని వదులుకున్నారు విజయ్‌ ఆంటోనీ. ‘‘నిర్మాతల కష్టాలను అర్థం చేసుకుని పారితోషికం తగ్గించుకున్న విజయ్‌ ఆంటోనీకి ధన్యవాదాలు. నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ నిర్మాతలకు అండగా ఉండాల్సిన తరుణమిది. ప్రొడ్యూసర్స్‌ యాక్టర్‌గా విజయ్‌ ఆంటోనీ ఒక ఉదాహరణగా నిలిచారు’’ అన్నారు ‘ఖాకీ’ చిత్రనిర్మాత టి. శివ. గత ఏడాది ‘కొలైగారన్‌’ (తెలుగులో ‘కిల్లర్‌’)తో సూపర్‌హిట్‌ సాధించిన విజయ్‌ ఆంటోనీ 2016లో వచ్చిన ‘పిచ్చైకారన్‌’ (తెలుగులో ‘బిచ్చగాడు’) సూపర్‌ సక్సెస్‌తో కోలీవుడ్, టాలీవుడ్‌లో బాగా పాపులర్‌ అయ్యారు.

మరిన్ని వార్తలు