కొత్త వినతులకు బ్రేక్‌ : విజయ్‌ ఫౌండేషన్‌

1 May, 2020 08:40 IST|Sakshi

హైదరాబాద్‌ : కరోనా కష్టకాలంలో పేద ప్రజలను ఆదుకోవడానికి హీరో విజయ్‌ దేవరకొండ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగగా రూ. కోటితో ‘ది  దేవరకొండ ఫౌండేషన్(టీడీఎఫ్‌)’‌, రూ. 25 లక్షలతో ‘మిడిల్‌ క్లాస్‌ ఫండ్(ఎంసీఎఫ్‌)‌’ అనే రెండు చారిటీ సంస్థలను ప్రారంభించాడు.  అందులో టీడీపీ ద్వారా కొందరు విద్యార్థులను ఎంపిక చేసి ఉద్యోగులుగా తీర్చిదిద్దనున్నట్టుగా తెలిపారు. అలాగే ఈ సంక్షోభ సమయంలో నిత్యావసరాలు లేక ఇబ్బంది పడుతున్నవారికి ఎంసీఎఫ్‌ ద్వారా సరుకులు అందజేయనున్నట్ట చెప్పారు. www.thedeverakondafoundation.org లాగిన్ అయి తమ వివరాలను నమోదు చేసుకుంటే ఫౌండేషన్ సభ్యులు స్వయంగా వారికీ నిత్యావసర సరుకులు అందిస్తామని ప్రకటించారు.

అయితే ఎంసీఎఫ్‌కు పెద్ద సంఖ్యలో‌ వినతులు వెల్లువెత్తడంతో ది దేవరకొండ ఫౌండేషన్‌ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 6 వేలకు పైగా కుటుంబాలకు సాయం అందించామని.. కానీ మాకు ఐదు రోజుల్లోనే 77,000 వినతులు వచ్చాయని తెలిపింది. తమ దగ్గర ఉన్న నిధులు అంతమందికి సాయం అందిచడానికి సరిపోకపోవడంతో.. కొత్త వినతులను స్వీకరించడాన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. బాధగా అనిపించినప్పటికీ.. ఈ నిర్ణయం తీసుకోవడం తప్పడం లేదని పేర్కొంది. ఇందుకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. (చదవండి : సాయంలోనూ ప్రత్యేకత చాటుకున్న విజయ్‌)

‘మేము ఈ ఫండ్‌ను 2000కు పైగా కుటుంబాలకు సహాయం చేయాలని  మొదలుపెట్టాం. గురువారంతో మా లక్ష్యాన్ని చేరుకున్నాం. మా అంచనాలకు మించి.. దాతలు ఇచ్చిన విరాళాలతో దాదాపు 6000 కుటుంబాలకు మేము సాయం అందజేశాం. అయితే గత 5 రోజుల నుంచి తమకు సహాయం చేయాలని 77,000లకు పైగా వినతులు వచ్చాయి. కానీ మా దగ్గర ఉన్న నిధులు అంతమందికి సహాయం అందజేయడానికి సరిపోవని చెప్పడానికి చింతిస్తున్నాం. అందుకే ప్రస్తుతం కొత్త వినతులు స్వీకరించడం ఆపివేస్తున్నాం. మా దగ్గర ఉన్న నిధులతో.. వచ్చిన వినతుల్లో సాధ్యమైనంత వరకు సాయం అందజేస్తాం. ఈ  సంక్షోభంలో ఇబ్బంది పడుతున్న మరిన్ని కుటుంబాలను ఆదుకోవాలంటే.. విరాళాలు అందజేసి మిడిల్‌ క్లాస్‌ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం’ అని ఆ ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వార్తలు