కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయటం నా బాధ్యత

31 Oct, 2019 00:07 IST|Sakshi
షామీర్, గోవర్థన్, తరుణ్‌ భాస్కర్, పూరి జగన్నాథ్, విజయ్‌ దేవరకొండ, సురేశ్‌బాబు

– విజయ్‌ దేవరకొండ

‘‘విజయ్‌ వాళ్ల నాన్న గోవర్థన్‌తో వర్క్‌ చేశాను. చాలామంచి వ్యక్తి.  ఈ చిత్రం ట్రైలర్‌ చూశాను, బావుంది. సినిమా విడుదల కోసం వెయిట్‌ చేస్తున్నాను. ఈ చిత్రంతో పాటు విజయ్‌ చేస్తున్న ‘వరల్డ్‌ ఫేమస్‌ లవ్‌’ పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు పూరి జగన్నాథ్‌. ‘పెళ్ళిచూపులు’ దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ హీరోగా ఆ చిత్ర హీరో విజయ్‌ దేవరకొండ నిర్మాతగా షామీర్‌ సుల్తాన్‌ దర్శకునిగా చేసిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ వేడుకలో పూరి జగన్నాథ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి. సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘విజయ్, తరుణ్‌ ఎదిగిన తీరు చూస్తుంటే ముచ్చటగా ఉంటుంది. ఈ చిత్రం ట్రైలర్‌ చూశాను. చాలా బాగుంది’’ అన్నారు. విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘ఐదారేళ్ల క్రితం టీవీలో సెలబ్రిటీలందరినీ చూసి నటుడవ్వాలనే కోరిక ఉండేది. అప్పుడు మా నాన్న నన్ను పూరిగారి దగ్గర వర్క్‌ చేయమని చెప్పారు. ఇప్పుడు నేను పూరిగారితో వర్క్‌ చేయటం మర్చిపోలేని అనుభూతి. కలలు కనండి, వాటిని నిజం చేసుకోవటానికి కష్టపడండి.

నన్ను చాలామంది సపోర్ట్‌ చేయటంతో ఈ స్థానంలో ఉన్నాను. అందుకే నేను కొత్తవారిని సపోర్ట్‌ చేస్తున్నాను. నా సక్సెస్‌కు కారణం సందీప్‌రెడ్డి వంగా. నిర్మాత సురేశ్‌బాబు గారు నా మొదటి సినిమా నుండి సపోర్ట్‌ చేస్తున్నారు’’ అన్నారు. ‘‘విజయ్‌ దేవరకొండ చేసే ఏ ప్రయత్నమైనా సక్సెస్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా’’ అన్నారు తరుణ్‌ భాస్కర్‌. షామీర్‌ మాట్లాడుతూ– ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్‌కి, వర్థన్‌ గారికి థ్యాంక్స్‌. రాకేశ్‌ పాత్రలో తరుణ్‌ భాస్కర్‌ చక్కగా నటించారు. అంతేకాకుండా ఎడిటింగ్, మ్యూజిక్‌ ఇలా అన్ని విభాగాల్లో చాలా సపోర్ట్‌ చేశారు. సినిమా విడుదల తర్వాత అందరి పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి’’ అన్నారు. నిర్మాతలు కె.ఎస్‌.రామారావు, మధురా శ్రీధర్, గోవర్థన్‌ దేవరకొండ, చార్మి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు