రాశీ ఖన్నా బెదిరించేది

14 Feb, 2020 00:44 IST|Sakshi
వల్లభ, క్రాంతి మాధవ్, రాశీ ఖన్నా, విజయ్‌ దేవరకొండ

‘‘నా సినిమాలకి బజ్‌ ఉండేది మీవల్లే (అభిమానులు) అని నాకు అర్థమైంది. మీ రౌడీస్‌ వల్ల, తెలుగు సినిమా ప్రేక్షకుల వల్ల ఈ బజ్‌ క్రియేట్‌ అవుతోంది. నేను నటించిన ఏ సినిమాకి వెళ్లినా మీకు ఒక కొత్త అనుభూతి ఉంటుందని గ్యారంటీ ఇస్తున్నా. ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ కూడా మీకొక కొత్త అనుభూతి ఇస్తుంది’’ అని విజయ్‌ దేవరకొండ అన్నారు. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’.

రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరిన్, ఇజాబెల్లే లెయితే హీరోయిన్లుగా నటించారు.  కె.ఎస్‌. రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. వైజాగ్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘నేను ముంబైలో షూటింగులో ఉండటం వల్ల ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమాకి ఎక్కువగా ప్రమోట్‌ చెయ్యలేదు. రాశీఖన్నా అయితే ‘నువ్వు రావాలి, బజ్‌ క్రియేట్‌ చెయ్యాలి, హైప్‌ క్రియేట్‌ చెయ్యాలి’ అని రోజూ ఫోన్‌ చేస్తూ నన్ను బెదిరిస్తూ వచ్చింది.

ఈ సినిమా ఏమవుతుందో నాకు తెలియదు. మీరే చెప్పాలి’’ అన్నారు. ‘‘మా నాన్నగారు ‘అభిలాష’, ‘ఛాలెంజ్‌’ లాంటి సినిమాలు వైజాగ్‌లో తీశారు. ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ వేడుకకి ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు కె.ఎ. వల్లభ. ‘‘మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చెయ్యడానికి విజయ్‌ దేవరకొండ నలుగురు అమ్మాయిలతో ఈ సినిమా చేశాడు. థియేటర్‌కు వచ్చి ఎంజాయ్‌ చెయ్యండి’’ అన్నారు క్రాంతి మాధవ్‌. ‘‘ఈ సినిమా వాస్తవానికి దగ్గరగా ఉంటుంది’’ అన్నారు రాశీ ఖన్నా.

మరిన్ని వార్తలు