ఆ ఇద్దరితో నటించాలని ఉంది: విజయ్‌

18 Mar, 2020 16:38 IST|Sakshi

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంతో ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించాడు విజయ్‌ దేవరకొండ. ఈ సినిమా థియేటర్‌ దగ్గర బోల్తా పడినప్పటికీ అతడి క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. హైదరాబాద్‌ టైమ్స్‌ రిలీజ్‌ చేసిన ‘మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌-2019’ జాబితాలో విజయ్‌ తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మీ ప్రేమ విషయం గురించి చెప్పండి అన్న ప్రశ్నకు అది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని ముక్కుసూటిగా జవాబిచ్చాడు. ఒకవేళ తాను ప్రేమలో పడినప్పటికీ ఆ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచుతానని తెలిపాడు. తన పర్సనల్‌ విషయం అందరికీ వినోదంగా మారడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని పేర్కొన్నాడు.

కేవలం ఆ సీక్రెట్‌ను తన తల్లిదండ్రులకు, స్నేహితులకు మాత్రమే చెప్తానని చెప్పుకొచ్చాడు. అందరికీ చాటింపు చేయడం నచ్చదని, అది ఎవరి వ్యాపారమూ కాదని రౌడీ ఘాటుగానే జవాబిచ్చాడు. సమయం, సందర్భం వచ్చినప్పుడు మాత్రమే అందరికీ బహిర్గతం చేస్తానన్నాడు. ఇక సినిమాల పరంగా ఎవరితోనైనా నటించేందుకు సిద్ధమేనని, అయితే బాలీవుడ్‌ హీరోయిన్లు కియారా అద్వానీ, జాన్వీ కపూర్‌లతో నటించాలని ఉందని మనసులో మాట చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో.. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫైటర్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ భామ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. (విజయ్‌ సినిమాలో విలన్‌గా అనసూయ..!)

మరిన్ని వార్తలు