ఆ సినిమా క్రేజీ హీరోను చేసింది..

24 Dec, 2017 10:34 IST|Sakshi

సాక్షి, చెన్నై: సినిమా పెద్ద మాయాబజార్‌. ఇది ఎవరిని ఎప్పుడు ఎక్కడ కూర్చోబెడుతుందో ఊహించలేం. ఇక్కడ ప్రతిభ ముఖ్యమే అయినా, అదృష్టం చాలా చాలా ముఖ్యం. సినిమాలో సక్సెస్‌ కోసం కొందరు నిరంతరం పోరాడుతూనే ఉంటారు. మరో కొందరు ఇట్టే అందలం ఎక్కేస్తారు. రెండవ కోవకు చెందిన హీరో విజయ్‌ దేవరకొండ. ఈ పేరును టాలీవుడ్‌లో ఈ మధ్య వింటున్నాం. కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించినా, గత ఏడాది తెరపైకి వచ్చిన పెళ్లి చూపులు చిత్రం ఈయనకు పెద్ద పేరు తెచ్చి పెట్టింది. 

ఇక ఈ ఏడాది ఆగస్ట్‌లో విడుదలైన ‘అర్జున్‌రెడ్డి’ సంచలన విజయం విజయ్‌ దేవరకొండను క్రేజీ హీరోను చేసేసింది. అంతే కాదు కోలీవుడ్‌ను ఆహ్వానించేలా చేసింది. విజయ్‌ ఇప్పుడు తమిళ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. ఇంతకు ముందు అరివానంబి, ఇరుముగన్‌ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ తాజాగా విజయ్‌ దేవరకొండను హీరోగా ఎంపిక చేసుకున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది.

ఈ చిత్రాన్ని సూర్య, కార్తీలతో పలు హిట్‌ చిత్రాలను నిర్మించిన స్టూడియో గ్రీన్‌ ఫిలింస్‌ అధినేత కేఈ.జ్ఞానవేల్‌ రాజా నిర్మించనున్నారు. ఆయన ఇటీవల ఒక ప్రకటనలో ఒకవైపు తాను, మరోవైపు దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ ఫొటోలు ముద్రించి మధ్య ఒక షాడో ఉంచి అది ఎవరో గెస్‌ చేయగలరా? అని పాఠకుల మెదడుకి పని కల్పించి ఉత్సుకతను రేకెత్తించారు. ఈ చిత్ర కథ, కథనం సరికొత్తగా ఉంటుందని దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ పేర్కొన్నారు. ఇక విజయ్‌ దేవరకొండ వస్తున్నా అంటూ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇక ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

>
మరిన్ని వార్తలు