కరణ్‌కు నో చెప్పిన విజయ్‌ దేవరకొండ

24 Jul, 2019 12:43 IST|Sakshi

ఒక్క సినిమాతోనే జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో విజయ్‌ దేవరకొండ. అర్జున్‌ రెడ్డి సినిమాతో బాలీవుడ్ సినీ జనాలను కూడా ఆకట్టుకున్న విజయ్‌, ప్రస్తుతం డియర్‌ కామ్రేడ్ సినిమాతో మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. బాహుబలి తరువాత దక్షిణాది భాషలన్నింటిలో రిలీజ్‌ అవుతున్న తొలి చిత్రంగా డియర్‌ కామ్రేడ్ రికార్డ్ సృష్టించనుంది.

డియర్‌ కామ్రేడ్‌ సినిమా చూసిన బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమా రీమేక్‌ హక్కులను సొంతం చేసుకున్నారు. అయితే కరణ్ బాలీవుడ్లోనూ విజయ్‌ని హీరోగా నటించమని కోరినా, విజయ్‌ మాత్రం ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. గతంలో అర్జున్‌ రెడ్డి రీమేక్‌ విషయంలోనూ నో చెప్పిన విజయ్‌ తాజాగా డియర్‌ కామ్రేడ్ రీమేక్‌ విషయంలో కూడా అదే విధంగా స్పందించాడు.

ఒకే కథలో రెండు సార్లు నటించటం తనకు ఇష్టముండదని, అందుకే రీమేక్‌ చిత్రాలకు నో చెపుతున్నాని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. హిందీ సినిమాలో అవకాశం వస్తే నటిస్తానన్న విజయ్‌, ముంబైలో సెటిల్ అయ్యే ఆలోచన మాత్రం లేదని చెప్పారు. తెలుగు, హిందీ భాషల్లో వర్క్‌ అవుట్‌ అయ్యే స్క్రిప్ట్ దొరికితే బాలీవుడ్ సినిమా చేయడానికి రెడీ అని తెలిపారు.

విజయ్‌ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్‌ కామ్రేడ్ జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకే రోజు రిలీజ్‌ అవుతోంది.

>
మరిన్ని వార్తలు