నవ్వులతో నిండిపోవడం ఆనందంగా ఉంది

3 Nov, 2019 00:05 IST|Sakshi
అవంతిక, షామీర్, విజయ్‌ దేవరకొండ, తరుణ్‌ భాస్కర్, అభినవ్‌ గోమటం

– విజయ్‌ దేవరకొండ

తరుణ్‌ భాస్కర్‌ హీరోగా షామీర్‌ సుల్తాన్‌ దర్శకత్వంలో హీరో విజయ్‌ దేవరకొండ నిర్మించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ఈ నెల 1న విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్ర బృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తరుణ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ– ‘‘ప్రేమతో, ఇష్టంతో చేసే పనిలో దేవుడు ఉంటాడు. ఆ ఇష్టంతో విజయ్‌ నిర్మించిన ఈ సినిమాకు మంచి ఫలితం వచ్చింది. ప్రేక్షకులు రెండు గంటలపాటు పగలబడి నవ్వుతున్నారు.

విజయ్‌ ఎప్పుడు దర్శకత్వం చేయాలనుకున్నా ఆ సినిమాకి నేను నిర్మాత అవుతా’’ అని అన్నారు. ‘‘మా అందరి కలలు నిజమయ్యాయి. నైజాంలో 80శాతం థియేటర్స్‌ ఫుల్‌ అయ్యాయి. వీటికంటే థియేటర్స్‌ అన్నీ నవ్వులతో నిండిపోవడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. సృజన్‌ అనే మరో కొత్త దర్శకుడితో మరో సినిమా నిర్మిస్తున్నా’’ అన్నారు విజయ్‌ దేవరకొండ. ‘‘సినిమా విడుదలైన రోజున మూడు థియేటర్స్‌కు వెళ్లాం. ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇందుకే రెండేళ్లు కష్టపడ్డాను’’ అన్నారు షామీర్‌. నటుడు అభినవ్, సంగీత దర్శకుడు శివకుమార్, ఎగ్జిక్యూటివ్‌ పొడ్యూసర్‌ అనురాగ్‌ మాట్లాడారు.

మరిన్ని వార్తలు