హీరో బర్త్‌డే.. బంగారు ఉంగరాలను పంచిన ఫ్యాన్స్‌

23 Jun, 2019 11:06 IST|Sakshi

పళ్లిపట్టు: నటుడు విజయ్‌ 45వ పుట్టినరోజు సందర్భంగా శనివారం అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. పళ్లిపట్టు రాధానగర్‌ విజయ్‌ ప్రజా సంఘం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంఘం అధ్యక్షుడు హరి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా మండల అధ్యక్షుడు లింగన్‌ పాల్గొని పేదలకు అన్నదానం చేశారు. ఇందులో రామదాసు, రాజ, శశి, స్టాలిన్, సుదీష్, దురై సహా అనేక మంది పాల్గొన్నారు. అలాగే కరింబేడు విజయ్‌ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక షిర్డీ సాయి మందిర్‌లో బాబాకు ప్రత్యేక పాలాభిషేకం, పూజలు చేశారు. విజయ్‌ పేటి అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదానం చేశారు. ఇందులో చారుకుమార్, ధరణి, చెంచయ్య, తిరుమలయ్య, గణేశ్, పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.

వేలూరులో సినీ నటుడు విజయ్‌ 45వ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. విజయ్‌ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు వేల్‌మురుగన్‌ అధ్యక్షతన అభిమానులు వేలూరు శిశుభవన్‌లోని కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచి పెట్టి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వేలూరు పెట్‌లాండ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం జన్మించిన చిన్నారులకు బంగారు ఉంగరాలను వేశారు. వేల్‌మురుగన్‌ మాట్లాడుతూ రానున్న సూపర్‌ స్టార్‌ విజయ్‌ జన్మదినోత్సవ వేడుకలను అభిమానుల ఆధ్వర్యంలో శిశు భవనంలో అన్నదానం చేయడం ఆత్మ సంతప్తినిస్తుందన్నారు. త్వరలో తమ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. శిశు భవన్‌లోని పిల్లలకు అన్నదానం చేసి దుస్తులను దానంగా చేస్తున్నామన్నారు. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన చిన్నారులకు ఉంగరాలు వేశామన్నారు. కార్యక్రమంలో విజయ్‌ అభిమానుల సంఘం కార్పోరేషన్‌ అధ్యక్షుడు శంకరన్, కార్యదర్శి సురేష్, భరత్, డివిజన్‌ కార్యదర్శి రాజేష్, జాయింట్‌ కార్యదర్శి వివేక్, విజయ్‌ మండ్ర అధ్యక్షుడు శరవణన్, రేణు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో అభిమానులు విజయ్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

మరిన్ని వార్తలు