సాక్షి, చెన్నై : హీరో విజయ్ ఇంటికి తిరుపూర్ బీజేపీ కార్యకర్తల నుంచి సోమవారం కాషాయ వస్త్రాలతో కూడిన పార్సిల్ వచ్చింది. విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ ఇటీవల ఒక సినీ వేడుకలో బీజేపీని పరోక్షంగా విమర్శించారు. సినిమాను ఎంజీఆర్ మినహా ఎవరూ కాపాడలేదని, పైరసీదారులకు రాజకీయవాదులే అండగా నిలుస్తున్నారనే అనుమానం వ్యక్తం అవుతోందన్నారు. ఈ విషయంలో పోరాటాలతోనే ప్రభుత్వాన్ని తట్టిలేపే ప్రయత్నం చేయాలన్నారు.
అదే విధంగా ఎన్నికల ఫలితాల అనంతరం మనమందరం కాషాయ వస్త్రాలు చుట్టుకు తిరగాల్సిన పరిస్థితి వస్తుందని బీజేపీపై పరోక్షంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలతోనే తిరుపూర్కు చెందిన బీజేపీ యువజన విభాగం పేరుతో ఆయన ఇంటికి కాషాయ పంచె, ఒక లేఖను జత చేసిన పార్సిల్ వచ్చింది. ఇందులో ఇప్పుడు మొదటిసారిగా కాషాయ వస్త్రాన్ని పంపుతున్నామని, ఇకపై వరుసగా ఇలాంటి వస్త్రాలను పంపుతూనే ఉంటామన్నారు. ఎందుకంటే మీరు ఇకపై కాషాయ వస్త్రాలనే ధరించి తిరగాలనే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారని గుర్తుచేశారు.