పెరంబూరు: ఈ ఎన్నికల్లో మార్పు రావాలని నటుడు విజయ్సేతుపతి పేర్కొన్నారు. నటుడిగా ఉన్నత స్థాయిలో రాణిస్తున్న ఈయన చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. మంచి మార్కెట్ ఉండడంతో ప్రైవేట్ కార్యక్రమాలకు అతిథిగా ఆహ్వానాలు అధికం అవుతున్నాయి. అలా గురువారం మదురైలోని ఒక నగల దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో అతి«థిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నలతో ముంచెత్తారు. యువత రాజకీయాల్లోకి రావాలని నటులు అంటుంటే ,రాజకీయ నాయకులు మాత్రం విముఖత చూపుతున్నారు. దీనిపై మీ కామెంట్ ఏమిటన్న ప్రశ్నకు తానీ కార్యక్రమానికి అతిథిగా వచ్చానని, కాబట్టి ఇలాంటి ప్రశ్నలను పక్కన పెడదాం అని అన్నారు. ఈ ఎన్నికలతో తమిళనాడులో మార్పు వస్తుందని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు మంచి జరిగే తీరుతుందన్న నమ్మకంతోనే తానూ మీ మాదిరిగానే ఓటు వేసి ఎదురుచూస్తున్నానని అన్నారు. మార్పు అన్నది ఎప్పుడూ అవసరం అని విజయ్సేతుపతి పేర్కొన్నారు.