కరోనా.. కొడుకు గురించి హీరో విజయ్‌ ఆందోళన!

14 Apr, 2020 13:49 IST|Sakshi

చెన్నై : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. అలాగే అంతర్జాతీయ విమాన సర్వీలసుపై కూడా నిషేధం విధించాయి. భారత్‌ కూడా మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది. దీంతో ఉన్నత విద్య కోసం, వ్యాపారం కోసం, ఉద్యోగం కోసం, హాలిడే కోసం.. ఇతర దేశాలకు వెళ్లిన చాలా మంది తమ స్వదేశాలకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వారి పరిస్థితిపై స్వదేశంలో ఉన్న వారి కుటుంబసభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రముఖ హీరో విజయ్ కుమారుడు జాన్సన్‌ సంజయ్‌ కూడా ప్రస్తుతం కెనడాలో చిక్కుపోయినట్టుగా తెలుస్తోంది. దీంతో విజయ్‌ తన కుమారుడి పరిస్థితిపై ఆందోళనతో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. గతేడాది చెన్నైలో స్కూలింగ్‌ పూర్తిచేసుకున్న సంజయ్‌.. ఉన్నతవిద్య కోసం విదేశాలకు వెళ్లాడు. అయితే ప్రస్తుం అతడు కెనడాలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో ఫిల్మ్‌మేకింగ్‌ కోర్స్‌ అభ్యసిస్తున్నాడు. అయితే ప్రస్తుతానికి కెనడాలో కరోనా తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ.. చాలా దేశాల్లో వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తుండటంతో విజయ్‌ తన కుమారుడి కోసం ఆందోళన చెందుతున్నట్టుగా సమాచారం.

ప్రస్తుతం విజయ్‌ తన భార్య సంగీత, కుమార్తె దివ్య సాషాలతో కలిసి చెన్నైలోని ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డులో ఉన్న తన నివాసంలో ఉంటున్నాడు. సంజయ్‌తో ఫోన్‌ ద్వారా మాట్లాడుతున్న విజయ్‌.. ఇంట్లో నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నాడు. అలాగే కరోనా నియంత్రణ చర్యలు పాటించాలని కోరుతున్నాడు. కాగా, సంజయ్‌ ఇప్పటికే కొన్ని షార్ట్‌ ఫిల్మ్‌ కూడా తీశాడు. గతేడాది సంజయ్‌, విక్రమ్‌ కుమారుడు ధ్రువ్‌తో కలిసి ఓ సినిమా తెరకెక్కనుందనే ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తేలింది.

మరిన్ని వార్తలు