రాములమ్మ మళ్లీ ఏడిపించింది అంటున్నారు

14 Jan, 2020 01:03 IST|Sakshi
విజయశాంతి

‘‘సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం అంటారే.. అలా సరైన సమయంలో సినిమాల నుంచి విరామం తీసుకున్నా.. మళ్లీ సరైన సమయంలో తెరపైకి వచ్చా. ‘సరిలేరు నీకెవ్వరు’ లో నా పాత్రకు  మంచి స్పందన వస్తోంది. అనేక మంది ఫో¯Œ  చేసి అభినందిస్తున్నారు. మిగతా భాషల పరిశ్రమల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. మహిళలకు బాగా నచ్చింది. మహిళలు ఫో¯Œ  చేసి ‘రాములమ్మా.. మళ్లీ ఏడిపించావ్‌’ అంటున్నారు.. మగవాళ్లూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు’’ అని విజయశాంతి అన్నారు. మహేశ్‌బాబు, రష్మిక మందన్నా జంటగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ‘దిల్‌’ రాజు సమర్పణలో అనీల్‌ సుంకర, మహేశ్‌ బాబు నిర్మించిన ఈ సినిమా శనివారం విడుదలైంది. పదమూడేళ్ల విరామం తర్వాత ఈ చిత్రంలో ప్రొఫెసర్‌ భారతి పాత్రలో నటించిన విజయశాంతి విలేకరులతో పంచుకున్న విశేషాలు...

► చాలా ఏళ్ల నుంచి అనేక మంది సినిమా చేయమని అడిగారు. రాజకీయాల్లో తీరిక లేకుండా ఉండటం వల్ల నటించాలనే ఆలోచన రాలేదు. ఆ సమయంలో సినిమా, రాజకీయాలంటూ ఇబ్బంది పడలేను. గతంలోనూ అనిల్‌ రావిపూడిగారు ఓ సినిమా కోసం సంప్రదించినప్పుడు చేయలేను అని చెప్పాను. మహేశ్‌ బాబు హీరో అని, ‘సరిలేరు నీకెవ్వరు’ కి అడిగినప్పుడు కథ విన్నాను.. నచ్చడంతో చేశా.. ఇప్పుడు ప్రేక్షకులకూ నచ్చింది. సంక్రాంతికి రియల్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ఇది.

► గ్యాప్‌ తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడం కొత్తగా అనిపించలేదు.. నటిగా నలభై ఏళ్ల అనుభవం చూశాను. మనతో నటించే ఆర్టిస్టులు మారారు కానీ సినిమా ఎప్పటికీ ఒకటే. నటనలో అదే పట్టు ఉంటుంది. సినిమా పరిశ్రమను మిస్‌ అవుతున్నాననే భావన కలగలేదు. ఇన్నేళ్లు హీరోయి¯Œ గా పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంటే సులువు కాదు.. చాలా పెద్ద విషయమది. తెలుగమ్మాయిగా, ఏళ్లపాటు ఒక స్థాయిని కాపాడుకుంటూ సినిమాలు చేయడం ఒక చరిత్ర సృష్టించడమే. లేకపోతే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానో, మరో పాత్రలకో వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చేది. దేవుడు ఎక్కడో నాకు మేలు చేశాడు, ప్రేక్షకులు ఆదరించారు.

► భారతి పాత్ర హుందాగా సాగుతుంది.. ఎక్కువగా తక్కువగా చేయకూడదు. ఆరంభం నుంచి చివరిదాకా ఒకేలా కనిపించాలి. తన బాధను బయ టపెట్టకుండా మనసులోనే దాచుకుంటుంది. విల¯Œ తో మాట్లాడేటప్పుడు తక్కువ డైలాగులున్నా సూది పెట్టి గుచ్చుతున్నట్లు ఉంటుంది. ఓవర్‌గా యాక్ట్‌ చేయడానికి లేదు. ప్రకాష్‌ రాజ్‌తో కళ్లలోకి చూస్తూ ‘ఏంటి భయమేస్తుందా? అడగటం వంటి డైలాగ్‌లు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి.

► కృష్ణగారి కుటుంబంతో నాకు ఏదో అనుబంధం ఉందనుకుంటా. ఈ బంధాన్ని దేవుడు నిర్ణయించినట్లు అనిపిస్తుంది. మహేశ్‌తో రీఎంట్రీ సినిమా చేస్తాననుకోలేదు.. ఆశ్చర్యం వేస్తోంది. ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమా చేస్తున్నప్పుడు మహేశ్‌ చిన్న పిల్లాడు. ఇప్పుడు సూపర్‌స్టార్‌ అయ్యాడు కదా! ఎలా ఉంటాడో అనుకున్నా. కానీ, తొలిరోజు నాతో మాట్లాడిన తీరు, చూపించిన అభిమానం చూసి నా భయాలన్నీ పోయాయి. కొన్ని రోజుల తర్వాత సరదాగా మాట్లాడేవాడు.

► ఒక్కొక్క సినిమాకు ఒక్కో తరహా పాత్ర దక్కుతుంటుంది. ‘ప్రతిఘటన’ సినిమాలో నేను నేరుగా ఏదీ చేయను.. చివరలో మాత్రం విల¯Œ ను గొడ్డలితో నరికి చంపేస్తాను. ‘సరిలేరు నీకెవ్వరు’ మహేశ్‌ సినిమా. హీరోతో పాటు నా పాత్ర కథలో సమాంతరంగా సాగుతుంటాయి. ఓ సన్నివేశంలో భారతి పాత్రకు సెల్యూట్‌ చేస్తాడు మహేశ్‌. నటిగా నాకు ఓ స్థాయి ఉండటం వల్లే హీరో సెల్యూట్‌ చేస్తే ప్రేక్షకులకు నచ్చింది.. వేరే వాళ్లు నటిస్తే వాళ్లు ఒప్పుకోరు.

► అందరూ బాధ్యతగా ఉండాలన్న ఒక మంచి విషయాన్ని ఈ చిత్రంలో దర్శకులు చెప్పారు. అది విన్నప్పుడు నిజమే కదా! అనిపించింది. ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉండాలి, సమాజాన్ని మనమే తీర్చిదిద్దాలి, ఆరోగ్యకరమైన వాతావరణం తీసుకురావాలి. మహిళలకు గౌరవం ఇవ్వాలి, మహిళల పట్ల క్రూరంగా ప్రవర్తించడం మన సంప్రదాయం కాదు కదా? అదే విషయాన్ని అనిల్‌ రావిపూడి చక్కగా చెప్పారు.

► ఈ సినిమాలో నటించకూడదని తొలుత అనుకున్నా. అనిల్‌ పట్టుబట్టి నాతో సినిమా చేయించారు..  ఆయనకేదో లెక్క ఉండి ఉంటుంది.. అది సరిగ్గా రీచ్‌ అయ్యింది. ఇందుకు అనిల్‌గారికి కృతజ్ఞతలు.  దర్శకులకు ఒక ఆలోచన ఉంటుంది.. కొడితే బంతి బౌండరీ దాటుతుంది. అన్ని పాత్రలకు సరిపోయే నటీనటులను ఎంచుకున్నారు. రాజకీయాల్లో ఒత్తిడితో బీపీ వస్తుంటుంది.. సినిమా చేస్తున్నప్పుడు మనశ్శాంతిగా, హాయిగా ఉంది.

► మన దగ్గరున్న పేరున్న దర్శకులకు అనిల్‌ తక్కువేమీ కాదు. నలభై ఏళ్ల అనుభవంతో చెబుతున్నా..  అనిల్‌ గొప్ప దర్శకుడు అవుతాడు. ఇంత భారీ సినిమాని చాలా కూల్‌గా, ఒత్తిడి లేకుండా, గందరగోళం లేకుండా వేగంగా చిత్రీకరించారు. తను తీసిన ‘పటాస్, రాజా ది గ్రేట్, ఎఫ్‌2 ’ సినిమాలు చూశాను.. మంచి మానవీయత, సెంటిమెంట్‌ ఉంది. ఆయనకు రాములమ్మ కథ ఇచ్చినా తెరకెక్కించగలరు. నాతో ‘కర్తవ్యం, ప్రతిఘటన’ లాంటి హీరోయి¯Œ  ఓరియంటెడ్‌ సినిమా చేయమని అనిల్‌ను కోరుతున్నా.

► ఇప్పటిదాకా 60 మంది హీరోలతో కలిసి పనిచేశాను. నాతో కలిపి 61 మంది అనుకోండి. 90వ దశకంలోనే నేను అత్యధిక పారితోషికం తీసుకున్నా. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో హీరో తర్వాత నాదే ఎక్కువ పారితోషికం. నటిగా ఎంతోమందికి స్ఫూర్తినివ్వడం నా అదృష్టం. ‘కర్తవ్యం’ సినిమా చూసి, అనేక మంది మహిళలు పోలీసు వృత్తిలోకి వచ్చారు.. మగవాళ్లు స్ఫూర్తిపొందారు. ‘రౌడీ ఇ¯Œ స్పెక్టర్‌’ చిత్రంలో ఆటోరాణి, ‘భారతరత్న’ చిత్రంలో సైనిక అధికారిగా నటించాను. ఇవన్నీ ప్రభావవంతమైన పాత్రలు. కొంతమంది మినీ విజయశాంతి అని పేర్లు పెట్టుకున్నారు కూడా. నాకు ఇంత పేరు తీసుకొచ్చిన ప్రజలకు రుణపడి ఉంటా. రాజకీయాల్లో ఉన్నా, సినిమాల్లో ఉన్నా ప్రజలు బాగుండాలని కోరుకుంటా.

► ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీరిలీజ్‌ కార్యక్రమంలో చిరంజీవిగారిని కలవడం గొప్ప అనుభూతి. ఆయన రాజకీయాల ప్రస్తావన తీసుకొస్తారని ఊహించలేదు. ఆయన మనసులోని సందేహాలన్నీ ఆ వేదికపై తీరిపోయాయి. రాజకీయాల్లో మా మధ్య కొంత దూరం పెరిగింది.. ఆ రోజు కార్యక్రమంలో అది సమసిపోయింది.

► సాధారణ పాత్రలు వస్తే చేయను. అలాంటి పాత్రలు చేసి ప్రేక్షకుల్లో నాకున్న గౌరవాన్ని తగ్గించుకోలేను. రొటీ¯Œ  అత్త పాత్రలు లాంటివి అస్సలు అంగీకరించను. బలమైన, శక్తిమంతమైన పాత్రలు వస్తే ఏడాదికి ఒక్కటైనా చాలు ఒప్పుకుంటా. నేను ఎక్కువగా తినను, వ్యాయామం చేస్తుంటాను. ఈ సినిమా కోసం కొంత జాగ్రత్తలు తీసుకుని బరువు తగ్గాను. మనసు నిర్మలంగా ఉంటుంది కాబట్టి అది మొహంలో కనిపిస్తుంటుంది అంతే.

మరిన్ని వార్తలు