13 ఏళ్ల తర్వాత విజయశాంతి తొలిసారిగా..

12 Aug, 2019 16:33 IST|Sakshi

ప్రముఖ నటి విజయశాంతి.. చాలా కాలం తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి హీరో మహేశ్‌బాబు ఇంట్రోను చిత్ర బృందం విడుదల చేసింది. తాజాగా విజయశాంతి 13 ఏళ్ల తర్వాత మేకప్‌ వేసుకున్నారంటూ దర్శకుడు అనిల్‌ రావిపూడి ఓ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ‘ఇట్స్‌ మేకప్‌ టైమ్‌ ఫర్‌ విజయశాంతి గారు’ అంటూ అనిల్‌ పేర్కొన్నాడు. ఈ 13 ఏళ్లలో ఆమె ఏ మాత్రం మారలేదు. అదే క్రమశిక్షణ, అదే వైఖరి, అదే డైనమిజమ్‌ అంటూ.. విజయశాంతి రీ ఎంట్రీకి స్వాగతం తెలిపాడు. మహేష్‌ బాబు కూడా విజయశాంతికి స్వాగతం తెలుపుతూ ట్వీట్‌ చేశాడు.

అలాగే ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ కూడా ‘వెల్‌కమ్‌ మేడమ్‌’ అంటూ అనిల్‌ పోస్ట్‌ను రీట్వీట్‌ చేశాడు. ఒకప్పుడు లేడీ సూపర్‌స్టార్‌గా  అభిమానులను అలరించిన విజయశాంతి గత కొన్నేళ్లుగా రాజకీయాలకే పరిమితం అయ్యారు. కాగా, ఈ చిత్రంలో మహేష్‌ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ‘దిల్‌’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేష్‌ బాబు సంయుక్తంగా నిర్మిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు  వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు రానుంది. 

దృక్పథం మారదు..
అనిల్‌ రావిపూడి, మహేష్‌ ట్వీట్‌లపై స్పందించిన విజయశాంతి.. వారి స్వాగతాన్ని గౌరవిస్తున్నట్టు తెలిపారు. ‘దృక్పథం అనేది మనిషి గొప్పతనాన్ని తెలుపుతుంది. వాతావరణం అనేది మారచ్చు కానీ.. దృక్పథం మారదు’అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు