విక్రమ్‌తో నయనతార?

23 Nov, 2015 07:01 IST|Sakshi
విక్రమ్‌తో నయనతార?

తమిళసినిమా : నటి నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంచలనాలకు చిరునామా ఈ భామ. శింబుతో ప్రేమాయనమః వరకూ, ప్రభుదేవాతో వివాహాయనమః దాకా వెళ్లి తుదకు మళ్లీ కన్యాయనమః అంటూ నటన దారి పట్టిన ఈ కేరళ కుట్టి మీడియాకు దూరంగా ఉంటుందంటారు గానీ ఆమె చేసే వ్యాఖ్యలు మాత్రం చాలాకాలం కలకలం సృష్టిస్తుంటాయి. ఆ మధ్య ఆమె ఏ నటుడితోనైనా నటిస్తాను కానీ విక్రమ్‌తో మాత్రం చేసేది లేదు అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

ఆమె అలా అనడానికి ఫ్లాష్‌బ్యాక్ వేరే ఉందిలెండి. అక్కడికి వెళ్లకుండా ప్రస్తుత విషయానికొస్తే విక్రమ్ తాజా చిత్రంలో నయనతార నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తున్న వార్తే. విక్రమ్ చాలా ఆశలు పెట్టుకున్న 10 ఎండ్రదుక్కుళ్ చిత్రం ఆయన ఆశలపై నీళ్లు చల్లింది. వెంటనే చిత్రం చేయలేని పరిస్థితి. అందుకే అంతకు ముందే కమిట్ అయిన మర్మమనిధన్ చిత్రం ప్రారంభానికి కాస్త ఆలస్యమైందని చెవులు కొరుక్కున్న వారూ లేకపోలేదు. ఏదేమైనా విక్రమ్ మర్మమనిధన్ సెట్‌పైకి వెళ్లడానికి టైమ్ ఆసన్నమైయ్యింది.

అరిమానంబి చిత్రం ఫేమ్ ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ముందు అనుకున్న నిర్మాత మారారు.దీన్ని ఐయింగరన్ సంస్థ మొదట నిర్మించతలపెట్టింది. ఇప్పుడీ చిత్రాన్ని పులి చిత్ర నిర్మాతల్లో ఒకరయిన శిబు తమీస్ నిర్మించనున్నారు. ఇందులో కాజల్‌అగర్వాల్ నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది.

ఇప్పుడామె స్థానంలో నయనతార నటించడానికి పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. ఇప్పటికే మాజీ ప్రియుడు శింబుతో ఇదు నమ్మ ఆళు చిత్రంలో రొమాన్స్ చేసిన నయనతార ఇప్పుడు విక్రమ్‌తో కలిసి నటించడానికి సిద్ధం అవుతోంది. ఇదే తరహాలో ఒక మాజీ ప్రియుడితో నటించిన ఈ మలయాళీ బ్యూటీ మరో మాజీ ప్రియుడు ప్రభుదేవాతో నటించనని తెగేసి చెప్పింది. అలాంటి నటి భవిష్యత్‌తో ఆయనతో నటించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం నయనతార జీవాతో తిరునాళ్, కార్తీకి జంటగా కాస్మోరా చిత్రాల్లో నటిస్తోంది.త్వరలో తన తాజా ప్రియుడిగా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో రెండవసారి నటించడానికి రెడీ అవుతోంది.