ఖరీదైన పల్లెటూరు

18 Nov, 2018 02:20 IST|Sakshi
మహేశ్‌బాబు

సినిమా కథకు అవసరాన్ని బట్టి సెట్లు రూపొందిస్తుంది చిత్రబృందం. ప్రాముఖ్యతను బట్టి సెట్‌ వ్యయం కూడా పెరుగుతుంది. ఇప్పుడు అలానే వ్యయానికి వెనకాడలేదు ‘మహర్షి’ చిత్రబృందం. ఈ సినిమాలో వచ్చే కీలక సన్నివేశాల కోసం ఖరీదైన పల్లెటూరి సెట్‌కి సుమారు నాలుగు కోట్లు ఖర్చు పెట్టారట. మహేశ్‌బాబు, పూజా హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. అశ్వినీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్‌లో స్టార్ట్‌ అయింది. ప్రత్యేకంగా వేసిన పల్లెటూరి సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట.

ఈ సెట్‌ రూపొందించడానికి సుమారు నాలుగు కోట్లు ఖర్చు చేసిందట చిత్రబృందం. ఆర్ట్‌ డైరెక్టర్‌ సునిల్‌ బాబు ఈ భారీ సెట్‌ని అచ్చం పల్లెటూరిని తలపించే విధంగా తీర్చిదిద్దారట. సినిమా సెకండ్‌ హాఫ్‌లో వచ్చే కీలక సన్నివేశాలను ఈ లొకేషన్‌లో ఎక్కువ శాతం చిత్రీకరిస్తారని సమాచారం. దాదాపు నెల రోజుల పాటు ఈ సెట్‌లో షూటింగ్‌ చేయడానికి ప్లాన్‌ చేశారట. ఈ షెడ్యూల్‌లో చిత్రబృందమంతా పాల్గొననుంది. ఇందులో మహేశ్‌ స్నేహితుడి పాత్రలో ‘అల్లరి’ నరేశ్‌ నటిస్తున్నారు. మహేశ్‌బాబు 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘మహర్షి’ వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా ఏప్రిల్‌ 5న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమేరా: కేయు మోహనన్‌.

మరిన్ని వార్తలు