త్వరలో తస్సదియ్యా...

15 Dec, 2018 02:24 IST|Sakshi
కియరా అద్వానీ, రామ్‌చరణ్

మంచి కుర్రాడిలా కనిపించేవాణ్ణి ఎవరైనా వినయం ఉన్నవాడు అంటారు. పెద్దవాళ్లు చెప్పిన పని చెప్పినట్లు చేసేవాణ్ని విధేయుడు అంటారు. ఈ రెండు లక్షణాలతో ఉన్న రామ్‌ అనే కుర్రోడి కథే ‘వినయ విధేయ రామ’. రామ్‌చరణ్, కియరా అద్వానీ జంటగా నటిస్తున్నారు. మాస్‌ చిత్రాలకు ట్రేడ్‌ మార్క్‌గా మారిన దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్‌ మొత్తం పూర్తి చేసుకుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు చిత్రబృందం.

ఈ సందర్భంగా చిత్రనిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ– ‘‘ఈ రోజు నుండి ఈ నెల 26 వరకు జరిగే షెడ్యూల్‌తో షూటింగ్‌ కంప్లీట్‌ అవుతుంది. ఈ షెడ్యూల్‌లో రెండు పాటలను చిత్రీకరిస్తాం. 2 పాటల్లో ఒకటి స్పెషల్‌ సాంగ్‌. ఆ పాటలో రామ్‌చరణ్‌ సరసన బాలీవుడ్‌ నటి ఈషా గుప్తా డ్యాన్స్‌ చేస్తారు. ఈ మధ్యే మేం విడుదల చేసిన మొదటి పాట ఆల్రెడీ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. డిసెంబర్‌ 17న ‘తస్సదియ్యా’ అనే మరో పాటను విడుదల చేయనున్నాం. మెగాభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మా చిత్రదర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించారు. ఈ సంక్రాంతికి విడుదలయ్యే మా ‘వినయ ..’ ప్రేక్షకులకు కనువిందు చేయనుంది’’ అన్నారు. ఈ చిత్రానికి  కెమెరా: రిషీ పంజాబి, ఆర్థర్‌ కె. విల్సన్, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్‌

మరిన్ని వార్తలు