వీఐపీ–2 పయనం మొదలైంది

16 Dec, 2016 02:33 IST|Sakshi
వీఐపీ–2 పయనం మొదలైంది

వీఐపీ(వేలై ఇల్లా పట్టాదారి) చిత్రం నటుడు ధనుష్‌ కేరీర్‌లో ఒక ముఖ్యమైన చిత్రంగా నిలిచింది. అందులో నటించిన నాయకి అమలాపాల్‌కు గుర్తుండిపోయే చిత్రం. కాగా తాజాగా అదే జంట ఈ చిత్రానికి సీక్వెల్‌లో హీరోహీరోయిన్లుగా నటిస్తుండడం విశేషం. ఇంతకు ముందు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించిన కబాలితో రికార్డులు బద్దలుకొట్టిన వీ.క్రియేషన్్స అధినేత కలైపులి ఎస్‌.థాను, ఎదిర్‌నీశ్చల్, వేలై ఇల్లా పట్టాదారి, కాక్కిసట్టై, మారి, నానూరౌడాదాన్, విచారణై, తంగమగన్, అమ్మాకణక్కు వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ధనుష్‌ వండర్‌బార్‌ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం వీఐపీ–2. ఇకపోతే భారతీయ సినిమాకు ఫొటో రియలిస్టిక్‌ మోషన్ క్యాప్చర్‌ 3డీ టెక్నాలజీని పరిచయం చేస్తూ, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా కోచ్చాడయాన్ వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకురాలు, సౌందర్యరజనీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది.

నటుడు ధనుష్‌ కథ, సంభాషణలు అందించి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో వివేక్, శరణ్యా, పోన్ వన్నన్, దర్శకుడు సముద్రఖని, రిషీఖేష్‌ కీలక పాత్రలను పోషిస్తున్నారు. సమీర్‌ తాహిర్‌ ఛాయాగ్రహణ, షాన్ రోనాల్డన్ సంగీతం అందిస్తున్న వీఐపీ–2 చిత్రం షూటింగ్‌ గురువారం చెన్నైలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. రజనీకాంత్, లతా దంపతులు ప్రత్యేక అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా వీఐపీ–2 చిత్రాన్ని తమిళం, తెలుగు బాషల్లో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర దర్శక నిర్మాతలు వెల్లడించారు.

>