పాడె మోసిన మెగాస్టార్‌.. వైరల్‌ ఫోటో

27 Jun, 2019 18:48 IST|Sakshi

సినీ దిగ్గజాలలో ఒకరైన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసే మానవతా సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇటీవల రైతుల రుణాలను కట్టి వార్తల్లో నిలవగా, పుల్వామా దాడిలో చనిపోయిన సైనికులకు కూడా ఆర్థిక సాయం చేశారు. ప్రతీ సందర్భంలోనూ తనలోని మానవాత్వాన్ని పేద, ధనిక అనే తేడాలు లేకుండా చూపెడుతున్న అమితాబ్ బచ్చన్ లేటెస్ట్‌గా చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.

అమితాబ్ బచ్చన్‌ దగ్గర సుదీర్ఘకాలంపాటు సెక్రటరీగా పనిచేసిన 77 ఏళ్ల శీతల్ జైన్ అనే వ్యక్తి ఇటీవల కన్నుమూశారు. 40 ఏళ్లపాటు అమితాబ్‌కు సెక్రెటరీగా పనిచేసిన శీతల్ జైన్ మరణించడంతో అమితాబ్ బచ్చన్, ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్‌లు తమ దగ్గర పని చేసిన వ్యక్తికి గౌరవంగా అతని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతే కాకుండా అతని పాడెను కూడా మోశారు. అమితాబ్, అభిషేక్ పాడెను మోసి గొప్ప మనసు చాటుకోగా.. జూన్‌ మొదటి వారంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. 'అమితాబ్ వద్ద గత 40 ఏళ్లుగా పని చేసిన సర్వెంట్ ఇటీవల మరణించారని, ఇంతకాలం అతడు తనకు చేసిన సేవలకు కృతజ్ఞతగా అతడి పాడె మోసిన అమితాబ్ గ్రేట్ మ్యాన్... డబ్బు అందరి దగ్గర ఉంటుంది, హ్యూమానిటీ అనేది కొందరి వద్ద మాత్రమే ఉంటుంది, హాట్సఫ్ అమితాబ్' అంటూ ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే అమితాబ్‌ పాడెమోసింది సర్వెంట్‌ది కాదని, ఆయన సెక్రటరీ శీతల్ జైన్‌ అంత్యక్రియల్లో అని తేలింది.

మరిన్ని వార్తలు