బర్త్‌డే రోజు కల నెరవేర్చుకుంటున్న నటి

1 May, 2018 14:00 IST|Sakshi

బెంగళూరు : బాలీవుడ్‌ బామ అనుష్క శర్మ పెళ్లి తర్వాత తన తొలి పుట్టిన రోజు వేడుకలను భర్త విరాట్‌ కోహ్లితో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఐపీఎల్ సందర్భంగా భర్తతో పాటు బెంగళూరులో ఉన్న అనుష్క శర్మ, విరాట్‌ సమక్షంలో కేక్‌ కట్‌ చేసి బర్త్‌డే వేడుకలను చేసుకున్నారు. ఈ పుట్టిన రోజు నుంచి అనుష్క శర్మ తన డ్రీమ్‌ను నెరవేర్చుకోబోతున్నారు. గత కొన్నేళ్లుగా మూగజీవుల హక్కులపై పోరాడుతున్న అనుష్క శర్మ, గాయపడిన, వయసు పైబడిన జంతువుల కోసం షెల్టర్‌ను ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించారు. తన 30వ బర్త్‌డే సందర్భంగా తన కోరికను నెరవేర్చుకోబోతున్నట్టు తెలిపారు. ముంబై శివారులో ఆరు ఎకరాలకు పైగా స్థలంలో ఈ షెల్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. నేటి నుంచే దీని నిర్మాణాన్ని కూడా అనుష్క శర్మ ప్రారంభించబోతున్నారు.

‘అనుష్క శర్మ అన్ని జంతువుల కోసం ఓ ప్రత్యేక గృహం ఏర్పాటు చేయాలని ఎంతో తాపత్రయం పడుతూ ఉండేవారు. వీటికి షెల్టర్‌ ఏర్పాటు చేయడం కోసం మూడేళ్లకు పైగా అనుష్క శర్మ విస్తృతమైన పరిశోధన చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇలాంటి ఇన్‌స్టిట్యూట్లను ఆమె సందర్శించారు. ఎప్పుడైతే ఆమె సంసిద్ధంగా ఉందని భావించారో, అప్పుడే ఈ షెల్టర్‌ను ఏర్పాటు చేయాలనుకున్నారు. జంతువులకు అవసరమైన పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనేది ఆమె ప్రధాన దృష్టి’ అని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఇది తనకు ఎంతో ప్రత్యేకమైన క్షణమని, తన కల నెరవేరబోతుందని అనుష్క చెప్పారు. ఈ బర్త్‌డే నిజంగా తనకు ఎంతో మెమరబుల్‌ మూమెంట్‌ అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ తన హృదయానికి సంబంధించిందని తెలిపారు. జంతువులకు తాను చేతనైనంత సాయం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. 

తన భార్య 30వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా విరాట్‌ కోహ్లి సైతం భార్యకు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనుష్క శర్మకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతూ.. కేక్‌ తినిపిస్తున్న క్యూట్‌ పిక్‌ను ట్విటర్‌, ఇన్‌స్టాగ్రాంలలో షేర్‌ చేశారు. ఆ ఫోటో కింద ఓ అద్భుతమైన మెసేజ్‌ను కూడా రాశారు. ‘హ్యాపీ బర్త్‌డే మై లవ్‌. నాకు తెలిసిన అత్యంత సానుకూల దృక్పథం, నిజాయితీ ఉన్న వ్యక్తివి నీవే. లవ్‌ యూ’ అని మై​క్రోబ్లాగింగ్‌ సైట్‌లో పేర్కొన్నారు. పెళ్లికి ముందు నుంచి ప్రతి ఒక్క సందర్భంలోనూ విరాట్‌, అనుష్కపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరికి సంబంధించిన క్యూట్‌ పిక్‌లను ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లలో పోస్టు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌ ఆడుతోన్న కోహ్లీ బెంగళూరులో ఉన్నారు. అనుష్క కూడా ఇక్కడే ఉండటంతో, కోహ్లీ సమక్షంలో అనుష్క కేక్‌ కట్‌ చేసి, తన బర్త్‌డే వేడుకలను జరుపుకున్నారు. ఈ వేడుకల్లో అనుష్కకు కేక్‌ తినిపిస్తూ సెల్ఫీ దిగిన ఫోటోను కోహ్లి సోషల్‌ మీడియాలో షేర్‌చేశారు. కోహ్లి షేర్‌ చేసిన ఈ సెల్ఫీకి 6400 రీట్వీట్లు, 55వేల లైక్‌లు వెల్లువెత్తాయి.

మరిన్ని వార్తలు