యాక్షన్‌కు బ్యానర్లు వద్దు

13 Nov, 2019 07:32 IST|Sakshi

సినిమా: యాక్షన్‌ చిత్రానికి బ్యానర్లు పెట్టవద్దని నటుడు విశాల్‌ అభిమాన సంఘం తరఫున మంగళవారం ఒక ప్రకటనను పత్రికలకు విడుదల చేశారు. నటుడు విశాల్, తమన్నా జంటగా నటించిన చిత్రం యాక్షన్‌. ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టెయిన్‌గా రూపొందిన ఈ చిత్రానికి సుందర్‌.సీ దర్శకుడు. ట్రెడెంట్‌ ఆర్ట్‌ పతాకంపై రవీంద్రన్‌ నిర్మించిన ఈ భారీ చిత్రానికి హిప్‌హాప్‌ తమిళా సంగీతాన్ని అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న యాక్షన్‌ చిత్రం ఈ నెల15న తెరపైకి రానుంది.

కాగా ఇటీవల శుభశ్రీ విషయంలో జరిగిన దుర్ఘటన తరువాత ఏ సినిమాలకు కటౌట్లను ఏర్పాటు చేయడం లేదు. అలాంటి వాటిని ప్రభుత్వమే నిషేధించింది కూడా. అయినా కొందరు దురభిమానులు పోస్టర్లు, బ్యానర్లు అంటూ హంగామా చేస్తునే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పురట్చి దళపతి విశాల్‌ మక్కళ్‌ నల ఇయక్కం అనే నటుడు విశాల్‌ ప్రజా సంఘం తరఫున ఆ సంఘం అధ్యక్షుడు వి.హరికృష్ణన్‌ ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో మన అభిమాన నటుడు విశాల్‌ నటించిన యాక్షన్‌ చిత్రం ఈ నెల 15న తెరపైకి రానుంది. కాగా ఈ సంతోషకరమైన తరుణంలో  అభిమానులెవరూ ప్రజలకు ఇబ్బంది కలిగించే చిత్ర బ్యానర్లను, జెండాలను ఏర్పాటు చేయరాదని, ఆ ఖర్చుతో పేదలు, అనాథుల సహాయపడే విధంగా ఉపయోగించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు