విశాల్‌ చిత్ర షూటింగ్‌ రద్దు

8 Dec, 2018 11:04 IST|Sakshi

చెన్నై, పెరంబూరు: నటుడు విశాల్‌ చిత్ర షూటింగ్‌ అనూహ్యంగా రద్దయ్యింది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం అయోగ్య. తెలుగు చిత్రం టెంపర్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటి రాశీఖన్నా కథానాయకిగా నటిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణలో ఉన్నా ఈ చిత్ర షూటింగ్‌ను గురువారం విళిపురం జిల్లా, మరకానం సమీపంలోని కూనిపాడులో నిర్వహించడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేసుకుంది. దీంతో చెన్నై నుంచి చిత్ర యూనిట్‌ కూనిపాడు చేరుకుంది. గురువారం ఉదయం ఆ ప్రాంతంలోని వినాయకుడి విగ్రహం ముందు పూజ చేసే సన్నివేశాన్ని చిత్రీకరించడానికి చిత్ర వర్గాలు సిద్ధం అయ్యారు. ఆ సమీపంలో మసీదు ఉంది.

గురువారం బాబ్రీ మసీదు కూల్చివేసిన దినం కావడంతో ముస్లీంలు బ్లాక్‌ డేను పాటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రాంతానికి చెందిన ముస్లీంలు కొందరు విశాల్‌ చిత్ర షూటింగ్‌ను అడ్డుకున్నారు. బ్లాక్‌డేను పాటిస్తున్న రోజును తమ ప్రాంతంలో వినాయకుడికి పూజలు చేసేలా షూటింగ్‌ చేయడాన్ని వ్యతిరేకిస్తూ మరకానం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ మైఖెల్‌హృదయరాజ్‌ పోలీసులతో కలిసి ఆ ప్రాంతానికి చేరుకుని అనుమతి లేకుండా షూటింగ్‌ చేయడం నేరం అని హెచ్చరించి బాబ్రీమసీదు కూల్చివేసిన రోజున మసీదు సమీపంలో షూటింగ్‌ చేయరాదని, వెంటనే నిలిపేయాలని చెప్పారు. దీంతో అయోగ్య చిత్ర వర్గాలు మరో దారి లేక షూటింగ్‌ను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని షూటింగ్‌ కోసం చెన్నై నుంచి బయలు దేరిన విశాల్‌కు తెలియజేయడంతో ఆయన మధ్యలోనే తిరిగి చెన్నైకి వచ్చేశారు.

మరిన్ని వార్తలు