ఇప్పుడిక... స్ట్రయిట్ గా తెలుగులో!

29 May, 2016 00:08 IST|Sakshi
ఇప్పుడిక... స్ట్రయిట్ గా తెలుగులో!

తెలుగు కుర్రాడు విశాల్ తమిళంలో తిరుగు లేని మాస్ హీరోగా దూసుకెళుతున్నారు. తమిళంలో ఆయన చేస్తున్న చిత్రాలన్నీ తెలుగులో అనువాదమై, ఇక్కడ విడుదలవుతుంటాయ్. పందెంకోడి, పొగరు, వాడు-వీడు, జయసూర్య, లేటెస్ట్‌గా ‘రాయుడు’.. వంటి చిత్రాల ద్వారా విశాల్ ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పట్నుంచో తెలుగులో స్ట్రైట్ మూవీ చేయాలనుకుంటున్న విశాల్ ఈ ఏడాది ఆ కోరిక నెరవేర్చుకోనున్నారు. ఇటీవల విడుదలైన తమిళ చిత్రం ‘మరుదు’ని తెలుగులో ‘రాయుడు’గా విడుదల చేసిన హరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హరి వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై సురాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.

ఈ చిత్రంలో జగపతిబాబు విలన్‌గా ఖరారయ్యారు. ఇందులో విశాల్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించనున్నారు. జూన్ 9న  హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘విశాల్-తమన్నా జంట ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. జగపతిబాబు మెయిన్ విలన్ కాగా, మరో విలన్‌గా తరుణ్ అరోరా నటిస్తారు. జూన్ నెలాఖరు వరకూ హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుతాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్స్, సహ నిర్మాతలు: ఎం.పురుషోత్తం, ఎ.కె ప్రకాశ్.