తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే

16 Jun, 2019 07:52 IST|Sakshi

పెరంబూరు:  తప్పెవరు చేసినా, శిక్ష అనుభవించాల్సిందేనని నటుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం( నడిగర్‌సంఘం) కార్యదర్శి విశాల్‌ పేర్కొన్నారు. ఈ సంఘంకు  ఎన్నికల 23వ తేదీన ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుత కార్యవర్గం అయన విశాల్‌ జట్టు మళ్లీ పోటీకి దిగగా,వారికి పోటీగా దర్శక,నటుడు కే.భాగ్యరాజ్‌ నేతృతకవంలో ఐసరిగణేశ్, ఉదయ,ప్రశాంత్‌ బరిలోకి దిగుతున్నారు.దీంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఓటు బ్యాంకు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. అందులో భాగంగా నటుడు విశాల్‌ ఇటీవల ఒక వీడియోను విడుదల చేసిన విషయం,దానిపై నటి వరలక్ష్మీశరత్‌కుమార్, రాధికాశరత్‌కుమార్‌లు ఆయనపై ద్వజమెత్తిన విషయం విదితమే.నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌  విశాల్‌ చర్యల్ని తీవ్రంగా ఖండించింది. ఇక నటి రాధికాశరత్‌కుమార్‌ సిగ్గుమాలిన చర్య అంటూ విశాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీరిద్దరికి బదులిచ్చే విధంగా నటుడు విశాల్‌ స్పంధించారు. ఆయన పేర్కొంటూ నడిగర్‌సంఘం ఎన్నికల గురించి పలు రకాల ప్రచారం జరుగుతోందన్నారు. వాటిని ఎలా ఎదుర్కోవాలన్నదే ఇప్పుడు  తీసుకోవలసిన చర్యలని పేర్కొన్నారు. ఒక వ్యక్తిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం అన్నది అంత సాధారణంగా జరగదన్నారు.అన్నీ పూర్తిగా విచారించిన తరువాతనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారని అన్నారు. తనతో సహా ఎవరైనా తప్పు చేస్తే శిక్షను అనుభవించాల్సిందేనని అన్నారు. తాము  సంఘానికి ఏం చేశామన్నది చెప్పాల్సి వచ్చినప్పుడు నటుడు శరత్‌కుమార్‌ పేరును ప్రస్ధావించాల్సి వచ్చిందనీ,అందులో తప్పు లేదనీ అన్నారు.కాగా ఇంత జరుగుతున్నా న డిగర్‌ సంఘ మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్‌ మౌనంగానే ఉండటం విశేషం. అంతే కాకుండా ఈ ఎన్నికల వ్యవహారం గురించి స్పంధించాల్సిందిగా మీడియా కోరగా  తాను ఆ సంఘంలో సభ్యుడినే కాదనీ,అలాంటప్పుడు ఎలా స్పంధిస్తాననీ శరత్‌కుమార్‌ బదులిచ్చారు. 

మరిన్ని వార్తలు