తమన్నాతో జార్జియాలో ఆటాపాటా

10 Sep, 2016 01:38 IST|Sakshi
తమన్నాతో జార్జియాలో ఆటాపాటా

 జార్జియాలోని సుందరమైన ప్రదేశాలలో మిల్కీబ్యూటీ తమన్నాతో డ్యూయెట్ పాడేసుకున్నారు నటుడు విశాల్. వీరి సరికొత్త కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం కత్తిసండై. ఇంతకు ముందు జయంరవి, హన్సిక జంటగా రోమియోజూలియట్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన మెడ్రాస్ ఎంటర్‌ప్రైజస్ సంస్థ అధినేత ఎస్.నందగోపాల్ తాజాగా విక్రమ్‌ప్రభు,షామిలి హీరోహీరోయిన్లుగా వీరశివాజీ చిత్రం,విశాల్,తమన్న జంటగా కత్తిసండై చిత్రాలను ఏక కాలంలో నిర్మిస్తున్నారు.

సురాజ్ దర్శకత్వం వహిస్తున్న కత్తిసండై చిత్రంలో హాస్య పాత్రల్లో వడివేలు, సూరి నటిస్తున్నారు. ఇతర ముఖ్యపాత్రల్లో జగపతిబాబు, తరుణ్‌ఆరోరా,చరణ్ దీప్, జయప్రకాశ్, నిరోషా, దాడి బాలాజీ, ఆర్తి, పావ లక్ష్మణన్ నటిస్తున్నారు. రిచర్డ్ ఎం.నాథన్ చాయాగ్రహణం, హిప్‌హాప్ తమిళ సంగీతాన్ని అందిస్తున్నారు.  ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ చిత్రంలోని కుట్టి కుట్టి నెంజిలే కాదల్ వందదుమ్ నెంజిల్ లక్షమ్ పూక్కల్ పూక్కుదే అనే పాటను ఇటీవల జార్జియాలో రాధిక నృత్యదర్శకత్వంలో విశాల్, తమన్నాలపై చిత్రీకరించినట్లు తెలిపారు.

అదే విధంగా విశాల్‌పై ఎవన్ నెనచ్చాలుమ్ ఎనైపుడిక ముడియాదు అనే పాటను చిత్రీకరించినట్లు వెల్లడించారు.పక్కా కామెడీ,యాక్షన్ ఓరియెంటెడ్ కథా చిత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి పాటలు అదనపు ఆకర్షణగా ఉంటాయని, కత్తిసండై ప్రేక్షకుల ఆదరణను కచ్చితంగా పొందుతుందనే నమ్మకం ఉందన్నారు. చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.