మళ్లీ పోటీకి సిద్ధం: విశాల్‌

25 May, 2020 07:58 IST|Sakshi

చెన్నై : నటుడు విశాల్‌ మరోసారి పోటీకి సిద్ధమవుతున్నట్టు తాజా సమాచారం. ఈయన ఇంతకుముందు దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగాను, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగాను పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. కాగా, ఈ రెండు సంఘాల బాధ్యతలను నిర్వహిస్తూ పలు ఆరోహణలను ఎదుర్కొన్నారు. చివరికి ఈ రెండు సంఘాల బాధ్యతలను ప్రభుత్వం ప్రత్యేక అధికారికి అప్పగించిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో తమిళ నిర్మాతల మండలి ఎన్నికల నిర్వహణకు కార్యాచరణ జరుగుతోంది. నిజానికి ఈ మండలి ఎన్నికలు జూన్‌ 21 జరగాలని మద్రాసు హైకోర్టు ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. (కన్నడ స్టార్స్‌.. కరోనా పాట )

అయితే, కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేయాల్సిందిగా కొందరు నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో సెప్టెంబర్‌ 30లోగా నిర్మాతల మండలి ఎన్నికలను నిర్వహించాలని, ఆ వివరాలను అక్టోబర్‌ 30లోగా కోర్టుకు సమర్పించాలని ఇటీవల ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, తమిళ నిర్మాతల మండలి ఎన్నికలకు ఇంతకుముందు నిర్మాత టి.శివ వర్గం, నిర్మాత మురళి వర్గం అదేవిధంగా కలైపులి ఎస్‌.థాను మూడు జట్లు పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితిల్లో పోటీకి దూరంగా ఉంటానని అందరూ భావించిన మండలి పూర్వ అధ్యక్షులు విశాల్‌ కూడా మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నట్టు తాజా సమాచారం. ఈయన తన పూర్వ జట్టుతోనే బరిలోకి దిగొచ్చునని తెలుస్తోంది. (సల్మాన్‌తో పూరి సినిమా?)

మరిన్ని వార్తలు