ఆ ముగ్గురికీ పదో చిత్రం

25 May, 2016 04:32 IST|Sakshi
ఆ ముగ్గురికీ పదో చిత్రం

ఒక్కోసారి కొన్ని విషయాలు యాదృచ్చికంగా జరిగిపోతుంటాయి. అలా చిత్ర కథానాయకుడికి, దర్శకుడికి, సంగీత దర్శకుడికి పదో చిత్రమైంది వేలైన్ను వందుట్టా వెళ్లైక్కారన్. విశేషం ఏమిటంటే ఈ చిత్రం ద్వారా నటుడు విష్ణువిశాల్ నిర్మాతగా మారారు. ఆయన కథానాయకుడిగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో ఎళిల్‌మారన్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. దీనికి ఎళిల్‌మారన్ దర్శకత్వం వహిస్తున్నారు. సత్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ముగ్గురికీ వేలైన్ను వందుట్టా వెళ్లైక్కారన్ పదో చిత్రం కావడం విశేషం.

నిక్కీగల్రాణి కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో సంతానం, సూరి రవి మరియు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రం వివరాలను తెలియచేయడానికి మంగళవారం చిత్ర యూనిట్ చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎళిల్‌మారన్ మాట్లాడుతూ చిత్ర కథను నటుడు విష్ణువిశాల్‌కు వినిపించగా చాలా బాగుందంటూ తానే ఈ చిత్రాన్ని నిర్మిస్తానని ముందుకొచ్చారన్నారు. ఈ రోజుల్లో చిత్రాన్ని నిర్మించడం కంటే దాన్ని ప్రమోషన్ చాలా కష్టం అయ్యిందన్నారు.

విష్ణువిశాల్ చిత్ర నిర్మాణ ఆలోచనలు, ప్రమోషన్ విధానం చాలా కొత్తగా ఉన్నాయని అన్నారు. చిత్ర హీరోయిన్ నిక్కీగల్రాణికి ఇందులో చాలా ప్రాధాన్యత ఉంటుందన్నారు. తను మహిళా పోలీస్‌గా నటిస్తున్నారని, ఫైట్స్ కూడా చేశారని తెలిపారు. చిత్ర కథానాయకుడు,నిర్మాతలలో ఒకరైన విష్ణువిశాల్ మాట్లాడుతూ వేల్లైన్ను వందుట్టా వెల్లైక్కారన్ చిత్రం తనకు మాత్రమే 10వ చిత్రం అనుకున్నానన్నారు.ఈ విషయాన్ని దర్శకుడికి చెప్పగా ఆయనకు,సంగీత దర్శకుడు సత్యకు 10వ చిత్రం అని తెలిపారన్నారు. నీర్‌పరవై చిత్రం తరువాత చిత్రాల ఎంపికలో చాలా శ్రద్ధ చూపిస్తున్నానన్నారు. అలా ఆలోచించి అంగీకరించిన చిత్రం ఇదని చెప్పారు.