వాఘాలో పాగా!

13 Nov, 2018 03:12 IST|Sakshi
సల్మాన్, కత్రినా

భారతదేశంలోని అమృత్‌సర్, పాకిస్తాన్‌లోని లాహోర్‌ నగరాలను కలిపే రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఉన్న వాఘా గ్రామంలో పాగా వేశారు సల్మాన్‌ఖాన్‌ అండ్‌ కత్రినా కైఫ్‌. ఇంతకీ సల్మాన్, కత్రినా భారత్‌కు వస్తున్నారా? లేక పాకిస్తాన్‌ వెళ్తున్నారా? అనే విషయాలు వెండితెరపై తెలుసుకోవాలి. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్, కత్రినా కైఫ్, దిశా పాట్నీ, జాకీ ష్రాఫ్‌ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘భారత్‌’. సౌత్‌ కొరియన్‌ మూవీ ‘ఓడ్‌ టు మై ఫాదర్‌’కి ఇది రీమేక్‌.

ఈ సినిమా తాజా షెడ్యూల్‌ పంజాబ్‌లోని లూధియానాలో ప్రారంభమైంది. సల్మాన్, కత్రినాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నిజానికి ఈ సినిమా షెడ్యూల్‌ను వాఘా గ్రామంలో ప్లాన్‌ చేశారు చిత్రబృందం. కానీ అనుమతి లభించకపోవడంతో లూధియానాలోనే వాఘా గ్రామ సరిహద్దు సెట్‌ను భారీ స్థాయిలో ఏర్పాటు చేసి, చిత్రీకరణ జరుపుతున్నారట. ఈ షెడ్యూల్‌ మరో వారం రోజులపాటు సాగుతుంది. ‘భారత్‌’ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల కానుంది.
 

మరిన్ని వార్తలు