మహిళా డైరెక్టర్‌కు హత్యా బెదిరింపులు

2 Aug, 2017 08:40 IST|Sakshi
మహిళా డైరెక్టర్‌కు హత్యా బెదిరింపులు
పెరంబూరు: భారతీయ జనతా పార్టీ, పుదియతమిళగం పార్టీలకు చెందిన కొంతమంది తనను చంపుతామని బెదిరిస్తున్నారని లఘు చిత్ర దర్శకురాలు దివ్యభారతి ఆరోపించారు. మధురై, ఆణైయూర్‌కు చెందిన ఈమె లెనినిస్ట్‌ సంఘంలో పనిచేస్తున్నారు. 2009లో లా కాలేజీ విద్యార్థి సురేశ్‌ పాము కాటుకు గురై మృతి చెందాడు. అతనికి నష్టపరిహారం ఇవ్వాలని దివ్యభారతి మధురై ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట పోరాటం చేసిన కేసులో గతవారం అరెస్టు అయ్యి అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె సోమవారం ఉదయం మాట్లాడుతూ కొన్ని రోజులుగా తనకు హత్యాబెదిరింపు కాల్స్‌ వస్తున్నాయన్నారు.

విదేశాల నుంచి కూడా ఈ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయన్నారు. తాను నిర్మించిన కక్కూస్‌ లఘు చిత్రాన్ని తప్పుగా అర్ధం చేసుకుని ఇలాంటి హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అయితే, వారు ఎవరనే విషయాన్ని ఆరా తీయగా బీజేపీ, పుదియ తమిళం పార్టీ నేత కృష్ణస్వామికి చెందిన వాళ్లమని చెబుతున్నారన్నారు. ఈ విషయాన్ని పోలీసులు తేల్చాలని కోరారు. అలాంటి వారికి కృష్ణస్వామి బుద్ది చెప్పాలన్నారు. కక్కూస్‌ చిత్రంపై కృష్ణస్వామి కోర్టులో పిటిషన్‌ వేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసిందని, ఆయన ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని సూచించారు. పశుమాంసం ఇతి వృత్తంగా లఘు చిత్రాన్ని రూపొందింస్తున్నందుకే తనకు ఈ బెదిరింపులు వస్తున్నట్లు భావిస్తున్నానని చెప్పారు.