నేను సినిమాల్లో నటించాలనుకోలేదు

19 Dec, 2016 00:17 IST|Sakshi
నేను సినిమాల్లో నటించాలనుకోలేదు

‘‘దళపతి, రోజా సినిమాల్లో నటించేటప్పుడు నా వయసు 21 సంవత్సరాలు. అప్పట్లో నేను సినిమాల్లో నటించాలనుకోలేదు. ఎందుకంటే నాకు సిగ్గెక్కువ. అయితే నటించడం మొదలు పెట్టాక వరుసగా సినిమాలు చేశా’’ అన్నారు అరవింద్‌ స్వామి. రామ్‌చరణ్, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్‌ నిర్మించిన ‘ధృవ’ ఈ నెల 9న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించి, మెప్పించిన అరవింద్‌ స్వామి మాట్లాడుతూ– ‘‘నేను సినిమాలే లోకం అనుకోలేదు. మధ్యలో బ్రేక్‌ తీసుకుని బిజినెస్‌లు చేశా.

‘ధృవ’ సక్సెస్‌ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ‘తని ఒరువన్‌’లో నేను చేసిన పాత్రే ‘ధృవ’లో చేయడంతో పెద్ద కష్టం అనిపించలేదు. సిద్ధార్థ అభిమన్యు పాత్రలో తెలుగు ప్రేక్షకులు కూడా నన్ను బాగా రిసీవ్‌ చేసుకున్నారు. భవిష్యత్తులోనూ నెగటివ్‌ రోల్స్‌ చేస్తా. వచ్చే ఏడాది చివర్లో డైరెక్షన్‌ చేయాలను కుంటున్నా. కథలు రెడీ చేసుకున్నా. అయితే, నా చిత్రంలో నేను నటించను. దర్శకులు మణిరత్నం గారితో పని చేయడానికి ఎప్పుడైనా సిద్ధమే. ‘తని ఒరువన్‌’ తర్వాత ‘జయం’ రవి, నేను నటించిన తమిళ చిత్రం∙‘బోగన్‌’ షూటింగ్‌ పూర్తయింది. ‘సదురంగ వేటై్ట’ సీక్వెల్, ‘వనంగా ముడి’, ‘భాస్కర్‌ ది రాస్కెల్‌’ తదితర చిత్రాల్లో నటిస్తున్నా’’ అని చెప్పారు.