నన్ను ఆహ్వానించలేదు

19 Apr, 2016 02:23 IST|Sakshi
నన్ను ఆహ్వానించలేదు

తమిళసినిమా: స్టార్స్ క్రికెట్ పోటీకి తనను ఆహ్వానించలేదని ఆరోపణలు పరిశ్రమలో అక్కడక్కడా వ్యక్తం అవుతున్నాయి.దక్షిణ భారత నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణానికి నిధిని సమకూర్చే కార్యక్రమంలో భాగంగా సంఘ నిర్వాహకులు ఆదివారం చెన్నైలో స్టార్స్ క్రికెట్ క్రీడా పోటీని నిర్వహించిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున్న జరిగిన ఈ కార్యక్రమంలో దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని విజయవంతం చేశారు.ఇది బృహత్తర కార్యక్రమం అని పలువురు మెచ్చుకున్నారు. అయితే కొందరు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

దక్షిణ భారత నటీనటుల సంఘానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో అప్పటి సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ వర్గానికి కొత్తగా పోటీకి దిగిన నటుడు విశాల్ వర్గానికి మధ్య చిన్న పాటి పోరే జరిగిందన్న విషయం తెలిసిందే. రాజకీయ ఎన్నికల వాతావరణాన్ని తలపించిన ఆ ఎన్నికల్లో విశాల్ వర్గం విజయం సాధించి సంఘ నిర్వాహక బాధ్యతల్ని చేపట్టింది. ఆదివారం జరిగిన స్టార్స్ క్రికెట్ క్రీడా పోటీ కార్యక్రమంలో  సంఘం మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, మాజీ కార్యదర్శి రాధారవి లాంటి ముఖ్యులు కొందరు పాల్గొనక పోవడం చర్చనీయాంశంగా మారింది.

నటుడు అజిత్, విజయ్, శింబు, రాధికా శరత్‌కుమార్,వడివేలు కూడా పాల్గొనలేదు. హాస్యనటుడు సూరికి ప్రాముఖ్యత నివ్వడంతో కినుకు వహించిన వడివేలు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదనే ప్రచారం కూడా హల్ చల్ చేసింది. అయితే ఆయన తల్లి అనారోగ్యం కారణంగా వడివేలు శనివారం రాత్రే మధురై వెళ్లాల్చి వచ్చిందని ఆయన సన్నిహితులు వివరించారు. ఇక నటుడు అజిత్ ఈ స్టార్స్ క్రికెట్ క్రీడా పోటీలను ముందుగానే విభేదించారు. నటి రాధికా శరత్‌కుమార్ తనతో పాటు చాలా మందికి ఆహ్వానం లేదని ఆరోపించడం ఆరోపణలు గుప్పించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం హల్‌చల్ చేస్తోంది. మరి ఆమె ఆరోపణలకు సంఘం నిర్వాకం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

>