‘సాహో’ వంటి భారీ యాక్షన్ మూవీ తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘జాన్’ (వర్కింగ్ టైటిల్). 1970 నేపథ్యంలో సాగే లవ్స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిందని ఇటీవల ప్రచారం జరిగింది. సినిమా కోసం భారీ సెట్ ఏర్పాటు చేయాలనుకున్నారని, అది అనుకున్న సమయానికి పూర్తికాకపోవడంతో షూటింగ్ వాయిదా పడిందని పుకార్లు వచ్చాయి. ఈ విషయంలో ప్రభాస్ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంపై చిత్ర బృందం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.
ఇదిలా ఉండగా,తమ హీరో కొత్త సినిమా అప్డేట్ కావాలని ప్రభాస్ ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా కోరుతున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ను ట్యాగ్ చేస్తున్నారు. దీంతో ట్విటర్లో #we want prabhas 20 update అనే హ్యాష్ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. ప్లీజ్ సర్ ప్రభాస్ గురించి ఒక్క అప్డేట్ అయినా ఇవ్వండి సర్ అంటూ ఫ్యాన్స్ వేడుకుంటున్నారు. మరి ఫ్యాన్స్ ఆవేదన చూసైనా దర్శక, నిర్మాతలు స్పందిస్తారేమో చూడాలి.