తెలుగమ్మాయిలు ఏం చెప్పినా హైలైట్‌ అవ్వదు!

29 Jul, 2017 00:33 IST|Sakshi
తెలుగమ్మాయిలు ఏం చెప్పినా హైలైట్‌ అవ్వదు!

‘‘టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువమంది ఉన్నారు. కానీ ఇప్పుడిప్పుడే కొత్త హీరోయిన్లు వస్తున్నారు. తెలుగు హీరోయిన్లకు ఎక్కువగా ఆప్షన్స్‌ ఉండటం లేదు. ఎందుకో నాకు తెలీదు. అయినా తెలుగు అమ్మాయిలు ఏం చెప్పినా హైలెట్‌ అవ్వదు. అదే ఏ బాలీవుడ్‌ హీరోయినో ప్రభాస్‌ పక్కన చేస్తానంటే అది హైలైట్‌ అయిపోతుంది’’ అన్నారు ఈషా. అశోక్, ఈషా జంటగా హరి ప్రసాద్‌ జక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్శకుడు’. విజయ్‌కుమార్, థామస్, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్‌ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈషా చెప్పిన విశేషాలు..

‘దర్శకుడు’ సినిమాకి ఆడిషన్స్‌ జరిగిన వెంటనే నన్నీ సినిమాలోకి తీసుకోలేదు. మూడు నెలల తర్వాత దర్శకుడు హరిప్రసాద్‌ నుంచి కబురొచ్చింది. తర్వాత డైరెక్టర్‌ సుకుమార్‌ను, చిత్రయూనిట్‌ను కలవడం జరిగింది. ఈ సినిమాలో నేను పెద్ద ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలనుకునే నమ్రత అనే అమ్మాయి క్యారెక్టర్‌లో నటించాను. డైరెక్టర్‌ కావాలనుకునే హీరోను నమ్రత కలుస్తుంది. వారిద్దరి మధ్య రిలేషన్‌ ఎలా సాగింది? చివరికి వారి జీవితాలు ఎలా ఎండ్‌ అయ్యాయి అన్నదే చిత్రకథ.
 
ఛాన్స్‌ వస్తే డైరెక్టర్‌ సుకుమార్‌గారి సినిమాలో తప్పకుండా చేస్తాను. ఆయన ఈ సినిమా సెట్స్‌కు రాలేదు. ఒకసారి ఆయన బంధువుల ఫంక్షన్‌లో నేను కలిశా. అప్పుడు సుకుమార్‌గారు ‘దర్శకుడు’ సినిమా, నా నటన చాలా బాగుందని మెచ్చుకోవడం ఆనందంగా అనిపించింది. నా సినీ జర్నీలో గ్యాప్‌ అంతగా రాలేదు. ‘అంతకు మందు ఆ తరువాత’ సినిమా తర్వాత ‘బందిపోటు’లో యాక్ట్‌ చేశాను. వెంటనే ఓ తమిళ సినిమా చేశాను. గత ఏడాది ‘మాయమాల్‌’, ‘దర్శకుడు’ సినిమాలు స్టారై్టయ్యాయి. ‘అమీ తుమీ’ ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టారై్ట, జూన్‌లో విడుదలైంది. ఛాలెంజింగ్‌ క్యారెక్టర్లు చేయడానికి ఇష్టపడతాను. ఉదాహరణకు ‘ఫిదా’లో భానుమతి (సినిమాలో సాయి పల్లవి పాత్ర పేరిది) క్యారెక్టర్‌ వస్తే తప్పకుండా చేస్తా. స్టార్‌ హీరోలతో అని కాదు అందరి హీరోలతో సినిమాలు చేయాలని ఉంది. కానీ, పెద్దగా అవకాశాలు రావడం లేదు.