హీరోగా చేసినా నవ్వించాలి

10 Mar, 2019 04:53 IST|Sakshi
ప్రవీణ్, మధు నందన్‌

‘‘ఊర్లో జులాయిగా తిరిగే పాత్రలు మావి. ఆ ఊరికి టీచర్‌గా వచ్చిన లక్ష్మీ రాయ్‌ని వెంటపడి ఆనందిస్తాం. ఆ తర్వాత మమ్మల్ని ఊరికి ఉపయోగపడేలా ఆమె ఎలా మారుస్తుంది? అన్నది కథ. హారర్‌ టచ్‌ ఉండే ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా ఇది. సినిమాలో మా ఇద్దరి సీన్స్‌ ఎంత నవ్విస్తాయో లక్ష్మీరాయ్‌తో ఉన్న సీన్స్‌ ఇంకా బాగా నవ్విస్తాయి’’ అని ప్రవీణ్, మధు నందన్‌ అన్నారు. రామ్‌ కార్తీక్, పూజిత పొన్నాడ హీరో, హీరోయిన్లుగా లక్ష్మీరాయ్‌ ప్రధాన పాత్రలో కిషోర్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘వేర్‌ ఈజ్‌ ది వెంకటలక్ష్మీ’. ప్రవీణ్, మధు నందన్‌  వినోదాత్మక పాత్రల్లో నటించారు. గురునాథ రెడ్డి సమర్పణలో ఎం. శ్రీధర్‌ రెడ్డి, ఆనంద్‌ రెడ్డి, ఆర్‌.కె. రెడ్డి నిర్మించారు.

ఈ నెల 15న రిలీజ్‌ కానున్న సందర్భంగా ప్రవీణ్, మధునందన్‌ మాట్లాడుతూ – ‘‘మేం సినిమాను అంగీకరించినప్పుడు లక్ష్మీరాయ్‌ లేరు. కథే ఆమెను వెతుక్కుంటూ వెళ్లింది. లక్ష్మీ రాయ్‌ ఆ ఊరికి ఎందుకు వచ్చింది? ఏం చేసింది అన్నది కథాంశం. మేం ఈ సినిమాను అంగీకరించడానికి కారణం కథ. మా పాత్రల ముగింపు. బయట మేం చాలా క్లోజ్‌ఫ్రెండ్స్‌. ఆ కెమిస్ట్రీ సినిమాలో మేం చేసే కామెడీలో కనిపిస్తుంటుంది. ఎమోషన్స్‌ చుట్టూ అల్లుకున్న కామెడీ కాబట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం. ఓ కమెడియన్‌ హీరోగా చేస్తే.. సినిమాలో 90 శాతం నవ్వులే ఉండాలి. అప్పుడే సోలో హీరోగా నటించాలి. ఫైట్లు, డ్యాన్స్‌ చేస్తానంటే కుదరదు. ఎందుకంటే.. వాటికి పెద్ద హీరోలు ఎలాగూ ఉన్నారు కదా?’’ అన్నారు.

మరిన్ని వార్తలు