చెల్లి పెళ్లికి డుమ్మా!

3 Feb, 2014 23:41 IST|Sakshi
చెల్లి పెళ్లికి డుమ్మా!
 ముంబై: ధర్మేంద్ర, హేమామాలిని చిన్న కూతురు అహనా డియోల్ పెళ్లికి బాలీవుడ్ పెద్దలంతా వచ్చేసినా, సవతి సోదరులు సన్నీ, బాబీ డియోల్ మాత్రం కనిపించలేదు. ఢిల్లీకి చెందిన వ్యాపారి వైభవ్ వోరాతో అహనా పెళ్లిని ముంబైలోని ఐదు నక్షత్రాల హోటల్‌లో ఆదివారం నిర్వహించారు. దక్షిణాది, పంజాబీ పద్ధతిలో పెళ్లి జరిపించారు. బాలీవుడ్ బాసులు షారుఖ్ ఖాన్, అమితాబ్, జయా బచ్చన్, ఐశ్వర్యరాయ్, అభిషేక్, రేఖతోపాటు జావెద్ అఖ్తర్, షబానా ఆజ్మీ, జితేంద్ర, దీపికా పదుకొణే, రణ్‌వీర్ సింగ్, జుహీచావ్లా, సాహిల్ సంఘా, దియామీర్జా, సోనాక్షి సిన్హా, ఆశాభోస్లే తదితరులు పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు.
 
 అయితే 2012లో జరిగిన ఈశా డియోల్ పెళ్లికి కూడా సన్నీ, బాబీ డియోల్ రాలేదు.  ధర్మేంద్ర సోదరుని కొడుకు అభయ్ డియోల్ మాత్రం పెళ్లిలో కనిపించాడు. విశేషమేమంటే ఈశా పెళ్లిలోనే అహనా, వోరాకు పరిచయమయిందట. అందంగా అలంకరించిన గుర్రపుబండిలో వోరా వివాహ వేదికకు చేరుకోవడంతో పెళ్లి లాంఛనంగా ప్రారంభయింది. పెళ్లి, విందును ముంబై ఐటీసీ మరాఠా హోటల్‌లోనే ఏర్పాటు చేశారు. ఈ ఏడాది బాలీవుడ్‌లో జరిగిన అతి పెద్ద పెళ్లి ఇదే కావడంతో తారలతోపాటు వ్యాపార ప్రముఖులు అనిల్ అంబానీ, ఆయన తల్లి కోకిలాబెన్, యోగాగురువు బాబా రామ్‌దేవ్ వంటి వాళ్లు కూడా వచ్చారు. రాజకీయ నాయకులు అమర్‌సింగ్, శివసేన అధిపతి ఉద్ధవ్‌ఠాక్రే, ఆయన సతీమణి రష్మి అహనా వివాహ విందులో కనిపించారు. సన్నీ, బాబీ రాకపోవడంపై మాట్లాడడానికి ధరే ్మంద్ర కుటుంబ సభ్యులెవరూ ఆసక్తి చూపలేదు.