ప్రతి క్షణం థ్రిల్ చేస్తుంది - నిర్మాత పీవీపీ

4 Feb, 2016 08:39 IST|Sakshi
ప్రతి క్షణం థ్రిల్ చేస్తుంది - నిర్మాత పీవీపీ

‘‘పీవీపీ సంస్థ నా ఒక్కడిదే కాదు... చాలా మంది కలిసి పని చేస్తున్నాం. యువ ప్రతిభావంతుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రవికాంత్, అడివి శేష్‌లతో కలిసి ఈ సినిమా నిర్మించాం. కంటెంట్, ఎనర్జీ ఉంటే కొత్తవాళ్లతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని నిర్మాత పరమ్ వి.పొట్లూరి అన్నారు. అడివి శేష్, అదా శర్మ, అనసూయ భరద్వాజ ప్రధాన పాత్రల్లో రవికాంత్ పేరెపు దర్శకత్వంలో పీవీపీ, కెవిన్ అన్నె సంయుక్తంగా నిర్మించిన ‘క్షణం’ ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘ప్రతి క్షణం థ్రిల్ చేసే సినిమా ఇది. మార్చి 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని పీవీపీ తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ - ‘‘నేను, అడివి శేష్ ఈ చిత్రకథ తయారు చేసి, పీవీపీ గారిని కలిస్తే మూడు రోజుల్లోనే ఓకే చేసి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. సస్పెన్స్ డ్రామాగా ఈ చిత్రం తీశాం. మూడేళ్ల పాప కనిపించకుండా పోతుంది. ఈ పాపను వెతికే ప్రయాణమే ఈ చిత్రం’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రకథ విన్న తర్వాత నన్ను పోలీసాఫీసర్ పాత్రకు ఎంపిక చేస్తారనుకోలేదు. ఇందులో ఉన్న మరో పాత్ర (అదా శర్మ చేసిన పాత్ర)కు తీసుకుంటారనుకున్నాను. కానీ, పోలీ సాఫీసర్ పాత్ర ఇచ్చి నన్ను కొత్తగా చూపించారు. రియలిస్టిక్ కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రమిది’’ అని అనసూయ భరద్వాజ చెప్పారు. చిత్ర సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల, కెమేరామ్యాన్ షనిల్ డియో తదితరులు పాల్గొన్నారు.