కుటుంబాన్ని ఒక్కటి చేసే విజేత!

11 Mar, 2014 22:46 IST|Sakshi
కుటుంబాన్ని ఒక్కటి చేసే విజేత!

కృష్ణంవంశీ సినిమాల్లో కుటుంబ సన్నివేశాలంటే... సందడి సందడిగా ఉంటాయి. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రానిది కూడా కుటుంబ నేపథ్యమే. ఈ సినిమా షూటింగ్ కేరళలోని పొల్లాచ్చిలో జరుగుతోంది. చరణ్, కాజల్, శ్రీకాంత్, కమలినీముఖర్జీలపై కథకు సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు కృష్ణవంశీ. ఈ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని, పచ్చదనాన్ని పట్టుచీరలా చుట్టుకున్న పొల్లాచ్చి లొకేషన్ అందాలు ఈ కథకు ఆభరణంగా నిలుస్తుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
 
 ఈ నెల 26 వరకూ అక్కడే జరిగే ఈ షెడ్యూల్‌లో... కీలక సన్నివేశాలతో పాటు ఒక పాట కూడా చిత్రీకరించనున్నారు. ఇప్పటివరకూ యాక్షన్ కథాంశాలతో మెరిపించిన చరణ్...
 ఈ సినిమాలో ‘దూరాలు మనుషులకే కానీ... మనసులకు కాదు’ అని కుటుంబానికి తెలియజెబుతూ... తెగిన బంధాలను ఒక్కటి చేసే విజేతగా కనిపిస్తారని సమాచారం.     ఈ నెలాఖరులో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయనున్నారు నిర్మాత బండ్ల గణేష్. కథకు తగ్గ టైటిల్‌ను త్వరలోనే ఖరారు చేయనున్నారు.