'ఆమె వివాహేతర సంబంధమే అసలు విషయం'

9 Aug, 2016 20:31 IST|Sakshi
'ఆమె వివాహేతర సంబంధమే అసలు విషయం'

తన తదుపరి చిత్రం 'రుస్తుం' గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు హీరో అక్షయ్ కుమార్. క్రైమ్ మిస్టరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో అక్షయ్ తొలిసారి నేవల్ ఆఫీసర్గా కనిపించనున్నారు.నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసిన ఈ సినిమాలో భార్య ప్రియుడిని చంపే వ్యక్తిగా అక్షయ్ నటిస్తున్నారు. దీనిపై అక్షయ్ మాట్లాడుతూ.. సాధారణంగా హిందీ సినిమాల్లో భర్త వివాహేతర సంబంధం కలిగి ఉంటాడు, చివరికి తన తప్పు తెలుసుకున్నాక భార్య అతడిని క్షమిస్తుంది, అంగీకరిస్తుంది. తిరిగి వారిద్దరూ సంతోషంగా జీవిస్తారు. కానీ ఈ కథలో అలా కాదు. భార్యే వివాహేతర సంబంధాన్ని కలిగి ఉంటుంది, భర్త క్షమాపణలు కోరుతుంది.. ఆ భర్త క్షమించాడా లేదా అన్నది తెర మీద చూడాల్సిన కథ అన్నారు. భార్య వివాహేతర సంబంధమే కథకు కీలకమైన పాయింట్ అని తెలిపారు.

ఈ సినిమాలో అక్షయ్ భార్యగా ఇలియానా నటిస్తున్నారు. తొలిసారి ఇంత వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నందుకు ఈ స్టార్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదటిసారి నౌకాదళ అధికారిగా నటిస్తున్న అక్షయ్.. పాత్రకు సంబంధించి ఎలాంటి శిక్షణ తీసుకోలేదని చెబుతున్నారు. ప్రత్యేకించి నౌకాదళ ఆఫీసర్లను కలవడంగానీ, పుస్తకాలను చదవడంలాంటివేమీ చేయలేదట. ఓ అధికారి మాత్రం సెల్యూట్ ఎలా చేయాలి, బ్యాడ్జెస్ ఎలా ధరించాలి అనే విషయాల్లో ఆయన్ను గైడ్ చేసినట్లు తెలిపారు. ఆ యూనిఫామ్ వేస్కున్న తరువాత మాత్రం తెలీకుండానే బాధ్యతగా ఫీలయ్యానని, అధికార దర్పం తెలిసిందని అంటున్నారు. ఆ యూనిఫామ్ ధరించేవారిని చూస్తుంటే తనకిప్పుడు అసూయగా ఉందని చెప్పారు ఎయిర్ లిఫ్ట్ స్టార్ అక్షయ్ కుమార్.

టిను సురేష్ దేశాయ్ దర్శకత్వం వహించిన రుస్తుం ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఇలియానా మరోసారి బాలీవుడ్లో తన అదృష్టం పరీక్షించుకోనుంది.