నృత్యాలూ పోరాటాల విషయంలో చాలా కష్టపడ్డాను - విష్ణు

27 Oct, 2013 01:32 IST|Sakshi
నృత్యాలూ పోరాటాల విషయంలో చాలా కష్టపడ్డాను - విష్ణు
‘‘ ‘దూసుకెళ్తా’ విడుదలై 9 రోజులైంది. ఇంకా తరగని వసూళ్లతో దూసుకెళుతోందీ సినిమా. అన్ని ప్రాంతాల నుంచీ మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది’’ అని మంచు విష్ణు అన్నారు. ఆయన కథానాయకునిగా వీరు పోట్ల దర్శకత్వంలో డా.మోహన్‌బాబు నిర్మించిన చిత్రం ‘దూసుకెళ్తా’. ఇటీవల విడుద లైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని ఆనందం వ్యక్తం చేస్తూ... శనివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 
 
 ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ -‘‘ఈ సినిమాలో నా నటన బాగుందని చాలా మంది అభినందించారు. అయితే... నటన విషయంలో నేను ఎప్పుడూ సంతృప్తి చెందను. నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నృత్యాలూ పోరాటాల విషయంలో మాత్రం చాలా కష్టపడ్డాను. అయితే... ప్రాణాల మీదకు తెచ్చుకునే సాహసాలు మాత్రం చేయలేదు. వచ్చేవారం భారీగా విజయోత్సవాన్ని జరుపుతాం’’ అని తెలిపారు. ‘‘ఓ వైపు దసరా సెలవులు అయిపోయాయి. 
 
 మరో వైపు భారీ వర్షాలు. అయినా ఈ సినిమాకు వసూళ్లు మాత్రం తగ్గలేదు. విష్ణు ఎనర్జిటిక్ యాక్షన్, బ్రహ్మానందం, ‘వెన్నెల’కిషోర్, రఘుబాబుల కామెడీ సన్నివేశాలు ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని వీరు పోట్ల చెప్పారు. ‘ఢీ’ లాంటి మంచి కథ కుదిరితే... తన దర్శకత్వంలో విష్ణుతో ఓ సినిమా చేస్తానని రచయిత గోపిమోహన్ చెప్పారు.